
- సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్యే చెప్పింది
- చంద్రబాబు కుట్రలను సింగయ్య భార్య బద్దలు చేసింది
- నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా?
- ఇంతకన్నా నీచ రాజకీయం ఉంటుందా?
- దళితుడు సింగయ్యను కుక్కతో పోలుస్తారా?
- చంద్రబాబుపై మాజీ మంత్రి శైలజానాథ్ ఫైర్
తాడేపల్లి: సత్తెనపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య వెల్లడించడం ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలను బద్దలు చేశారని అన్నారు. నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదు. దళితులు, అణగారిన వర్గాల పట్ల తన అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోతున్నారు. సత్తెనపల్లి లో జరిగిన సింగయ్య మరణంపై చంద్రబాబు నీచంగా మాట్లాడటం ద్వారా తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే కుక్క పిల్లలా లాగిపడేశారని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని కుక్కతో పోల్చడం వెనుక దళితులపై చంద్రబాబు తనకు ఉన్న చులకలభావాన్ని చాటుకున్నారు. సింగయ్య మరణాన్ని అడ్డం పెట్టుకుని, వైఎస్ జగన్పై పన్నిన కుతంత్రంను సింగయ్య భార్య ధైర్యంగా మాట్లాడి పటాపంచలు చేశారు.
దళితులంటే అంత చులకనా బాబూ
సింగయ్య భార్య లూర్దు మేరి వైఎస్ జగన్ని కలిశారు. తమ కుటుంబానికి వైఎస్ జగన్ అంటే అభిమానమని, ఆయన్ను చూడటానికి తాను, తన భర్త సింగయ్య బయటకు వచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు తన భర్తే స్వయంగా మా పేర్లు, ఫోన్ నెంబర్లు చెప్పారని, అంబులెన్స్ లోకి చేరేవరకు బాగానే ఉన్నారని, బాగానే మాట్లాడుతున్నారని, తనకు కొద్దిపాటి దెబ్బలే తగిలాయని చెప్పిన విషయం ఆమె గుర్తు చేశారు. ఆటోలో తీసుకెళ్తామని చెప్పినా వినకుండా అంబులెన్స్లో తరలించారు. బాగా మాట్లాడుతున్న వ్యక్తి ఎలా చనిపోయాడని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.
ఎస్పీ సైతం ప్రమాదం జరిగిన్పపుడు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారు. నారా లోకేష్ 50 మందిని తన ఇంటికి పంపించి బెదరించారని బాధితురాలు మేరీ చెబుతోంది. ఇవన్నీ సింగయ్య మరణంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దళితుల పట్ల చంద్రబాబు ఎంత ప్రేమ ఉందనేది మా అందరికీ తెలుసు. మొన్న తెనాలిలో దళిత యువకులను పోలీసులు లాఠీలు విరిగేలా కొడితే వారిపై చర్యలు తీసుకోకుండా గంజాయి బ్యాచ్ అని విషప్రచారం చేశారు. గత చంద్రబాబు పాలనను పక్కన పెడితే, ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్ననే చంద్రగిరిలో దళిత మహిళను బట్టలు చించి కొట్టారు.
జేమ్స్ అనే యువకుడితే మూత్రం తాగించారు. దళితుల మీద సాంఘిక బహిష్కరణలు ఎక్కువైపోయాయి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా కనీసం దానిపై ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? మంగళగిరి నియోజకవర్గంలో దళితులు నడిచారని రోడ్డు మైలపడిందని పసుపు నీళ్లతో కడిగిన దారుణం ఇప్పటికీ మా కళ్లలో కదులుతూనే ఉంది. సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై టీడీపీ యువకులు 16 మంది రెండేళ్లుగా అత్యాచారం చేస్తే వారి కుటుంబానికి న్యాయం చేశారా? ఆ బాలిక తండ్రి మీ పార్టీ కార్యకర్త అని, మీ పార్టీ విజయోత్సవ సంబరాల్లో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ వారి కుటుంబాన్ని ఆదుకోకపోగా ఇంత దారుణంగా మృతుడి కుమార్తెకి అన్యాయం చేస్తారా? ఇలా ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకున్నారా? ఒక దళితుడిని కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్లినంత మాత్రాన దళితులను ఉద్దరించినట్టు ప్రజలకు అనుకుంటారనే భ్రమల్లో నుంచి బయటకు రండి. మైకులు పెట్టి ఇచ్చిన స్ర్కిప్టు చదివితే మేం నమ్మేస్తామని ఎలా అనుకుంటారు?
మీ హయాంలో జరిగిన వాటికి ఏం సమాధానం చెబుతారు?
నాడు సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్లో ఉండగా గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట జరిగి 29 మంది అమాయక భక్తులు చనిపోయారు. చంద్రబాబు నిర్వహించిన కందుకూరు రోడ్ షోలో 7 మంది చనిపోయారు. గుంటూరులో చంద్రబాబు బహిరంగ సభ తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస జాగ్రత్తలు పాటించని కారణంగా ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ప్రమాదాలు జరిగిన అన్ని సందర్భాల్లో అక్కడ చంద్రబాబు ఉన్నారు. వీటన్నింటికీ ఆయన ఏం సమాధానం చెబుతారు.
అన్ని వర్గాల్లోనూ కూటమి ప్రభుత్వంపై రోజురోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోంది. వైఎస్ జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుని, ఆయన పర్యటనలకు బ్రహ్మరథం పడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వైఎస్ జగన్కి ఉన్న ప్రజాభిమానాన్ని తక్కువ చూసి చూపించడానికి వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఆయన బయటకు రాకుండా చేయాలనే కుట్రతో ఆయన పర్యటనలకు అనుమతులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై చర్చ జరిగితేనే పాలన మెరుగువుతుందన్న కీలక విషయాన్ని చంద్రబాబు మర్చిపోతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు. సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక మందం అనడం దేనికి సంకేతం? పోలీసులను కూడా పార్టీల వారీగా విభజించి వేధిస్తున్న ఘనత చంద్రబాబుది.
ఇంత వికృతమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లింది. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారో చర్చించటానికి మేము సిద్ధం. మా హయాంలో జరిగిన అప్పుల గురించి తప్పుడు ప్రచారం చేశారు. లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని సింగయ్య భార్య చెప్పింది. దీనిపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పటం లేదు?, ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై లైంగిక దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారు?, ఆ బాలిక తండ్రి టీడీపీ కార్యకర్త. చంద్రబాబు మీటింగుకి వెళ్లి ఆయన చనిపోయారు. అలాంటి కుటుంబానికి చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?, చంద్రబాబు గానీ ఆయన మంత్రులుగానీ కనీసం పరామర్శించకపోవటానికి కారణం ఏంటి?, లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని శైలజానాత్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: