రఘురామా.. ప్లీజ్ గెటవుట్! | Raghurama Raju Got Insulted Near Amit Shah House | Sakshi
Sakshi News home page

రఘురామా.. ప్లీజ్ గెటవుట్!

Mar 9 2024 2:59 PM | Updated on Mar 9 2024 3:39 PM

Raghurama Raju Got Insulted Near Amit Shah House - Sakshi

2024 ఎన్నికల తర్వాత రఘురామ ఇంటి ముందు మాజీ ఎంపీ అనే బోర్డే సెటిల్..

వైఎస్సార్‌సీపీ ప్రభంజనంలో గెలిచి తెలుగుదేశం పల్లకి మోస్తోన్న  రఘురామ కృష్ణం రాజుకు  తన అసలు విలువ ఏంటో ఇపుడు తెలిసొచ్చింది. హస్తినలో కేంద్రమంత్రి అమిత్‌షా‌ నివాసంలోకి వెళ్లాలనుకున్న రఘురామకు ఘోర పరాభవం ఎదురైంది. చంద్రబాబు నాయుడికి చాకిరీ చేసిన రఘురామ.. ఈ అవమానంతో రఘురామ రాజు కుత కుత ఉడికిపోయారు. ఇంత దారుణమా అని రగిలిపోయారు.

జగన్ మోహన్ రెడ్డి  మేనియాతో 2019లో ఫ్యాన్ ప్రభంజనలో నరసాపురం లోక్ సభ స్థానం నుండి గెలిచి ఎంపీ అనిపించుకున్నారు రఘురామ. ఆ తర్వాత తన గొంతెమ్మ కోరికలు చట్టవిరుద్ధ వ్యాపకాలకు సహకరించడం లేదని జగన్‌కు దూరం జరిగారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడితో చేరి కుట్ర రాజకీయాలు చేశారు. నిత్యం ఎల్లో మీడియాలో కూర్చుని ప్రభుత్వంపైనా ముఖ్యమంత్రిపైనా అసభ్య పదజాలంతో విష ప్రచారం చేశారు.

అయిదేళ్లుగా వైఎస్సార్‌సీపీ పార్టీ ద్వారా వచ్చిన పదవి అనుభవిస్తూ చంద్రబాబు నాయుడి  దగ్గర టిప్పులు తీసుకుంటూ  రాజకీయ భిక్ష పెట్టిన జగన్‌ను విమర్శిస్తూ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు రఘురామ. అపుడు ఆయన వైఎస్సార్‌సీపీ ఎంపీ హోదాలో పార్లమెంటులో కానీ.. బయట కానీ బీజేపీ అగ్రనేతలను కలవగలిగారు. ఆ వాపునే ఆయన బలుపు అనుకున్నారు.

తన అసలు బలం ఏంటో ఈ రోజు తెలిసొచ్చింది రఘురామ కృష్ణం రాజుకు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్‌సీపీని  ఓడించడం మాట దేవుడెరుగు గట్టి పోటీని కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ లు బిజెపి పొత్తుకోసం మూడు రోజులుగా అమిత్‌షా ఇంటి ముందుపడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. సర్లే అని  అమిత్‌షా‌ చంద్రబాబు, పవన్ లను తన నివాసంలోకి పిలిచారు. వారితో పాటే షా నివాసంలోకి దూరి వెళ్లిపోదామనుకున్న  రఘురామ వారి వెనకాలే వెళ్లారు.

బాబు, పవన్ లను లోనికి పంపించిన సెక్యూరిటీ సిబ్బంది రఘురామను మాత్రం ఆగక్కడ అని  ఆపేశారు. తాను రఘురామ కృష్ణం రాజుని అని తన గురించి తాను చెప్పుకున్న భద్రతా సిబ్బంది లోనికి పంపలేదు. అక్కడే నిలబడ్డంతో  సార్ ప్లీజ్ గెటవుట్ అని చాలా మర్యాదగా అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. దీంతో రఘురామ ముక్కు ఎగ పీల్చుకుని కుమిలిపోయారు. చేసేదేమీ లేక నిస్సహాయంగా మిగిలిపోయారు.

ఇంత కాలం తనకు అపాయింట్ మెంట్లు ఇచ్చిన బీజేపీ నేతలు.. ఇపుడు తనకి పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వకపోవడం ఎందుకో రఘురామకు నెమ్మదిగా బోధపడ్డం మొదలైంది. తానిపుడు వైఎస్సార్‌సీపీ లేను కాబట్టే బీజేపీ నేతలు తనని పురుగుని చూసినట్లు చూస్తున్నారని అర్ధమైంది.

ఇంత కాలం చంద్రబాబు కోసం చెత్త రాజకీయాలు చేసినా కనీసం చంద్రబాబు అయినా తనని షా నివాసంలోకి తీసుకుపోతారేమోనని రఘురామ అనుకున్నారు. కనీసం షా ఇంట్లోకి వెళ్లిన తర్వాత అయినా సెక్యూరిటీకి ఫోన్ చేయించి తనని లోపలికి రమ్మనమని పిలుస్తారని అనుకున్నారు. అయితే అలాంటివేవీ జరక్కపోవడంతో  రఘురామకు బాగా కాలింది. ఈ అవమానాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే దిగమింగుకుని కదిలారు రఘురామ.

రఘురామకు దీన్ని మించిన షాక్ మునుముందు తగులుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచే తాను పోటీ చేస్తానని రఘురామ చెప్పుకున్నారు. టీడీపీ,జనసేన, బీజేపీల్లో ఏదో ఒక పార్టీ తరపున చేస్తానన్నారు. అయితే ప్రస్తుత  వాతావరణం చూస్తోంటే   రఘురామకు ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి కనపడ్డం లేదని హస్తిన వర్గాలు అంటున్నాయి. అంటే 2024 ఎన్నికల తర్వాత రఘురామ ఇంటి ముందు మాజీ ఎంపీ అనే బోర్డే సెటిల్ అయిపోవడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు.

:::సీఎన్‌ఎస్‌ యాజులు, సీనియర్‌ జర్నలిస్టు

Advertisement
 
Advertisement
Advertisement