బినామీల కోసమే బాబు అమరావతి ఉద్యమం | Nandigam Suresh Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బినామీల కోసమే బాబు అమరావతి ఉద్యమం

Nov 2 2020 2:35 AM | Updated on Nov 2 2020 9:44 AM

Nandigam Suresh Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతిలో తన బినామీలు నష్టపోకూడదని టీడీపీ చేయిస్తున్న కృత్రిమ ఉద్యమానికి మద్దతుగా ఎల్లో మీడియాలో ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారుడు రాతలు రాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేశ్‌ ధ్వజమెత్తారు. రెండు రోజుల క్రితం ‘జైలు ముట్టడి’ పేరుతో కొందరు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటే దాన్ని ‘నిర్బంధ కాండ’ అంటూ చంద్రబాబుకు వత్తాసు పలికే ఆ రెండు పత్రికలు, టీవీ చానెళ్లు అభూతకల్పనలు వండి వార్చాయని మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో అల్లర్లు సృష్టించేందుకు బాబు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఏదైనా జరిగితే ప్రభుత్వంపై నెట్టాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నందిగం సురేశ్‌ మీడియాతో మాట్లాడారు. 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఉద్యమం..
కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చేస్తున్న ఉద్యమాన్ని రైతుల ఉద్యమంగా చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సింగపూర్‌ టెక్నాలజీతో అమరావతిని తీర్చిదిద్దుతాను.. రైతులు సెంట్‌ స్ప్రే చేసుకుని ఏసీ రూముల్లో పడుకోవడమే తరువాయి అని ఊదరగొట్టారు. అప్పుడు కూడా ఎల్లో మీడియా దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇప్పుడు కృత్రిమ ఉద్యమం కోసం జరగని దాన్ని జరిగినట్లుగా చిత్రీకరిస్తోంది. 

దళితుల్లో చిచ్చుపెట్టేందుకే
దళితులపైనే దాడులు చేయించి దళితుల్లో చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. నమ్మిన వారిని నట్టేట ముంచే నైజం ఆయనది. దళితులు, రైతుల జీవితాలతో బాబు చెలగాటమాడుతున్నారు. ఆయన మోసాన్ని అమరావతి ప్రజలు గుర్తించాలి. ఇరవై తొమ్మిది గ్రామాలకే నాయకుడుగా చంద్రబాబు మిగిలిపోతారు.  

Advertisement
 
Advertisement
Advertisement