మోదీని నిలదీసినందుకే రాహుల్‌పై కక్ష  | Meenakshi Natarajan comments over modi | Sakshi
Sakshi News home page

మోదీని నిలదీసినందుకే రాహుల్‌పై కక్ష 

Apr 28 2023 3:07 AM | Updated on Apr 28 2023 3:07 AM

Meenakshi Natarajan comments over modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతి సంపదను అదానీ వంటి పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న ప్రధాని మోదీని నిలదీసినందుకే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాందీపై కక్షగట్టి ఎంపీ పదవి నుంచి తప్పించారని మాజీ ఎంపీ, రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ జాతీయ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్‌ ధ్వజమెత్తారు. దేశ సంపద అవిరైపోతుంటే జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని రాహుల్‌ డిమాండ్‌ చేయడం మోదీకి నచ్చలేదని, అందుకే పార్లమెంటుకు రాకుండా చేశారని విమర్శించారు.

రాహుల్‌ గాందీపై అనర్హత వేటును నిరసిస్తూ రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన్‌ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గాం«దీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ ప్రజలపక్షాన పోరాడుతున్న వ్యక్తిని కేంద్రం వేధిస్తోందని... ఈ నేపథ్యంలో ప్రజలు రాహుల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావిద్‌ మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ విషయంలో మోదీ, అమిత్‌షాలు చేస్తున్న రాజకీయ కుట్రలపై కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటం చేస్తుందన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ప్రజలు వ్యతిరేకించాలన్నారు. నటరాజన్‌ పోరాటానికి సంపూర్ణ మద్దతిస్తూ పోస్టుకార్డులను పోస్టు చేశారు. దీక్షా కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించారు. రాజీవ్‌ గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ చైర్మన్‌ సిద్దేశ్వర్‌ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో పీసీసీ మాజీ చీఫ్‌ వి. హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్, టీపీసీసీ ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement