‘మునుగోడు ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమే’ | Madhu Yaskhi Serious Political Comments On BJP And TRS | Sakshi
Sakshi News home page

మునుగోడు ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమే: మధు యాష్కీ

Sep 29 2022 3:19 PM | Updated on Sep 29 2022 3:23 PM

Madhu Yaskhi Serious Political Comments On BJP And TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ సీఎం కేసీఆర్‌.. తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే జాతీయ పార్టీ అంటున్నాడు. కేసీఆర్‌.. తన కుటుంబంపై వచ్చిన అవినీతి కేసుల నుండి తప్పించుకునే పనిలో ఉన్నాడని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కి తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, మధుయాష్కీ గురువారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేయడంలోనే భాగంగానే జాతీయ పార్టీ ప్రకటన అని కేసీఆర్‌ అంటున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా ఒరిగేదేమీ లేదు. కేసీఆర్ రాజ‌కీయంగా వేసే అడుగుల‌న్నీ బీజేపీకి ఉప‌యోగప‌డేలా ఉన్నాయి. జాతీయ పార్టీ అంటూ కేసీఆర్‌.. యూపీఏ భాగ‌స్వామ్య పార్టీల నాయ‌కుల‌నే క‌లుస్తున్నాడు. బీజేపీకి మ‌ద్ద‌తుగా ఉన్న పార్టీల‌ను, నాయ‌కుల‌ను క‌ల‌వ‌డం లేదు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా ఎటువంటి రాజ‌కీయ కూట‌మి సాధ్యం కాదు. కేసీఆర్ త‌న అవినీతిని క‌ప్పి పుచ్చుకునే ప్ర‌య‌త్నాల్లో భాగంగానే జాతీయ పార్టీ అంటున్నాడు. లిక్క‌ర్ స్కామ్ నుంచి త‌ప్పించుకునేందుకు బీజేపీకి కేసీఆర్ అంత‌ర్గ‌తంగా స‌హ‌క‌రిస్తున్నాడు. త‌న కుటుంబంపై వచ్చిన అవినీతి కేసుల నుండి తప్పించుకునే పనిలో కేసీఆర్ బిజీగా ఉన్నాడు. టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు అనే బీజేపీ ప్ర‌చారం కూడా తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకే చేస్తున్నారు. టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉండ‌ద‌ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కూడా బీజేపీ-టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగ‌మే. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. దేశంలో అత్యంత మోసపూరిత ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని శరద్ పవార్ నాతో అన్నాడు. కేసీఆర్ ఎనిమిదేళ్ళ పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు.

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ నిజమైతే కేసీఆర్ అవినీతిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎందుకు చ‌ర్యలు లేవు. లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబానికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. చెట్లతో వేల కోట్లు సంపాదించిన వ్యక్తి కూడా లిక్కర్ స్కామ్‌లో ఉన్నాడు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి రేపో ఎల్లుండో అరెస్ట్ అవుతారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు కూల్చి.. ఎనిమిది ఏండ్ల తర్వాత విగ్రహం పెట్టారు. విగ్రహం పెట్టడానికి ఎనిమిది ఏండ్లు పట్టిందా..? కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెట్టాం అని కేటీఆర్‌ గొప్పగా చెప్పుకుంటున్నారు. తమ్ముడు తారక రామారావు.. స్టోరీ లు చెప్పడం మానుకో. తెలంగాణ ప్రజలు తిరుగు బాటుకి సిద్ధం అవ్వండి అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement