కేంద్రంలో కాంగ్రెస్‌ రావడం అనివార్యం | Madhu Yashki Goud Satirical Comments on KCR | Sakshi
Sakshi News home page

కేంద్రంలో కాంగ్రెస్‌ రావడం అనివార్యం

May 4 2024 3:40 AM | Updated on May 4 2024 3:40 AM

Madhu Yashki Goud Satirical Comments on KCR

కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై ప్రధాని అబద్ధాలు 

మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల్లో ముంచారు 

మీట్‌ ది ప్రెస్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం అనివార్యమని, జనాభాలో అధిక శాతం ఉన్న పేద వర్గాలకు సామాజిక న్యాయం కలి్పంచేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పోరాటం కొనసాగిస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో స్థాపించిన సంస్థలను అమ్మడమే తప్ప.. మోదీ సర్కార్‌ కొత్తగా ఏర్పాటుచేసిన సంస్థలేమీ లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో మధుయాష్కీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసి, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగానే తమకు 400 సీట్లు ఇవ్వాలంటూ మోదీ ప్రజలను కోరుతున్నారన్నారు.

 కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మధుయాష్కీ ధ్వజమెత్తారు. విదేశాలనుంచి నల్లదనం తెస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాను ఓబీసీ అని చెప్పుకునే మోదీ.. ఓబీసీలకు ఒక్క మేలు కూడా చేయలేదన్నారు. 
 

కేసీఆర్‌ అప్పుల్లో ముంచారు 
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, అవినీతి.. అక్రమాలతో తెలంగాణను సర్వనాశనం చేశారని మధుయాష్కీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూల్చేస్తాం, పడగొడతామంటూ ఒకదిక్కు బీఆర్‌ఎస్, మరోదిక్కు బీజేపీ అవాకులు చవాకులు పేలుతున్నాయని, అందుకే తాము ఇతర పార్టీలనుంచి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నామని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చా రు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement