సీఎం గుమ్మం తాకే దమ్ముందా?

లోకేశ్పై మంత్రి కొడాలి మండిపాటు
ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేని దద్దమ్మవు.. అధికారంలోకి వస్తావా?
నీ తోలు వలిచి చెప్పులు కుట్టిస్తాం జాగ్రత్త
ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం పూర్తిగా స్వచ్ఛందమే
సాక్షి, అమరావతి: సీఎం జగన్పై పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న శుంఠ నారా లోకేశ్ను ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. రెండున్నరేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం.. మీ సంగతి తేలుస్తాం.. కొడుకుల్లారా..! అంటూ మంత్రుల్ని, పోలీసుల్ని లోకేశ్ నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన శాస్తి తప్పదని స్పష్టం చేశారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. విద్యార్థులందర్నీ తన సొంత పిల్లలుగా భావిస్తూ వారి అభ్యున్నతి కోసం తపిస్తున్నారని చెప్పారు.
ఎమ్మెల్యేగా కూడా గెలవలేని దద్దమ్మ..
అనంతపురం వెళ్లిన నారా లోకేశ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడటంపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను ఇళ్లకు వచ్చి కొడతామని, సీఎం ఇంటిని ముట్టడిస్తామని బెదిరించటాన్ని ఎద్దేవా చేశారు. ‘లోకేశ్.. దమ్ముంటే రా... చంద్రబాబు కుమారుడివి అయితే రా. సీఎం జగన్ గుమ్మాన్ని తాకి చూడు. తోలు వలిచి చెప్పులు కుట్టిస్తాం. తాత, తండ్రి ముఖ్యమంత్రులైనప్పటికీ ఎమ్మెల్యేగా కూడా గెలవలేని చవట, దద్దమ్మవు. నువ్వు అధికారంలోకి రావడమేమిటి? నోటికి ఎంత వస్తే అంత వాగడం మినహా ఏం తెలుసు? జంతువులా ఒళ్లు పెంచితే చంద్రబాబు గదిలో బంధించి చీవాట్లు పెట్టడం నిజం కాదా?’ అని ప్రశ్నించారు.
లోకేశ్ కొవ్వు తొలగించారు..
సీఎం జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనంపై ఎక్కడా బలవంతం చేయటంలేదు. పూర్తిగా స్వచ్ఛందమే. ఎయిడెడ్ జీవోను వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. చంద్రబాబులా పొద్దున్న జీవోలిచ్చి మధ్యాహ్ననికి రద్దు చేయడం, మాట మార్చడం సీఎం జగన్ రక్తంలో లేదు. నారా లోకేశ్కు ఒళ్లు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. అందుకే పిచ్చి వాగుడు వాగుతున్నారు. లోకేశ్ మాటలు, చేష్టలు చూసి ఇలాంటి కుమారుడు ఎందుకు పుట్టాడని చంద్రబాబు రోజూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. 25 వేల మంది ఓటర్లున్న సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో గెలవడానికే చంద్రబాబు ఆపసోపాలు పడుతుంటే ఇక లోకేశ్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తాడా? మళ్లీ అధికారంలోకి వస్తారా? బాబు సీఎం కాలేడు, ఆయన కుమారుడు ఎమ్మెల్యే కాలేడు. లోకేశ్ బ్లడ్లో కొవ్వు బాగా పెరిగితే డాక్టర్లు 30 నుంచి 40 కిలోల కొవ్వు తొలగించారు.
ప్రభుత్వ స్కూళ్లలో చేరికలే నిదర్శనం..
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలిదశలో 15 వేల ప్రభుత్వ పాఠశాలలను రూ.3,600 కోట్లు వెచ్చించి నాడు–నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేశారని కొడాలి నాని తెలిపారు. చంద్రబాబు హయాంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 4 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరి చదువుకోవడం ఓ రికార్డు అని చెప్పారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, గోరుముద్ద తదితర పథకాలతో పాటు ప్రభుత్వ స్కూళ్లల్లో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలే దీనికి కారణమన్నారు.
సంబంధిత వార్తలు