నా కుటుంబం జోలికొస్తే సహించను | Sakshi
Sakshi News home page

నా కుటుంబం జోలికొస్తే సహించను

Published Tue, Dec 29 2020 11:18 AM

Kethireddy Pedda Reddy Warning To JC Prabhakar Reddy - Sakshi

సాక్షి, పెద్దవడుగూరు: తమ కుటుంబం జోలికి వస్తే ఎంతటివారినైనా సహించేది లేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా తన కుమారులను బెదిరిస్తూ చానల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారని, ఇలాంటి వాటికి తాను భయపడేది లేదన్నారు. సోమవారం పెద్దారెడ్డి మిడుతూరులో మీడియాతో మాట్లాడారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలు శాంతియుతంగా జీవనం గడపాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని రెచ్చగొట్టే పోస్టింగ్‌లు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లకు చెక్‌ పెడదామని నాలుగు రోజుల క్రితం ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లానన్నారు.

అయితే తాను దాడి చేయడానికి వచ్చానని, అక్కడున్న వారిని బెదిరించానని టీడీపీ నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పోలీసులు ఆదివారం తమపై కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా ఇరు వర్గాల వారిపైనా కేసులు నమోదు చేశారని చెప్పారు. టీడీపీ హయాంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కు తాళాలు వేసినా, ప్రబోధానంద ఆశ్రమంపై దాడులకు ఉసిగొల్పి అల్లర్లు సృష్టించినా అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేయకపోవడాన్ని గుర్తు చేశారు. నిష్పక్షపాత పాలన సాగిస్తున్న వైఎస్సార్‌సీపీపై అవాకులు చెవాకులు పేల్చుతున్న టీడీపీ నాయకులు గతంలో జరిగిన ఘటనలను గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడే తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయిందన్నారు. (చదవండి: జేసీ ఆరోగ్యం కాపాడుకో..)

Advertisement

తప్పక చదవండి

Advertisement