breaking news
Miduturu
-
నా కుటుంబం జోలికొస్తే సహించను
సాక్షి, పెద్దవడుగూరు: తమ కుటుంబం జోలికి వస్తే ఎంతటివారినైనా సహించేది లేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా తన కుమారులను బెదిరిస్తూ చానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారని, ఇలాంటి వాటికి తాను భయపడేది లేదన్నారు. సోమవారం పెద్దారెడ్డి మిడుతూరులో మీడియాతో మాట్లాడారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలు శాంతియుతంగా జీవనం గడపాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన అనుచరులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రెచ్చగొట్టే పోస్టింగ్లు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే పోస్టింగ్లకు చెక్ పెడదామని నాలుగు రోజుల క్రితం ప్రభాకర్రెడ్డి ఇంటికి వెళ్లానన్నారు. అయితే తాను దాడి చేయడానికి వచ్చానని, అక్కడున్న వారిని బెదిరించానని టీడీపీ నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పోలీసులు ఆదివారం తమపై కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా ఇరు వర్గాల వారిపైనా కేసులు నమోదు చేశారని చెప్పారు. టీడీపీ హయాంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్కు తాళాలు వేసినా, ప్రబోధానంద ఆశ్రమంపై దాడులకు ఉసిగొల్పి అల్లర్లు సృష్టించినా అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేయకపోవడాన్ని గుర్తు చేశారు. నిష్పక్షపాత పాలన సాగిస్తున్న వైఎస్సార్సీపీపై అవాకులు చెవాకులు పేల్చుతున్న టీడీపీ నాయకులు గతంలో జరిగిన ఘటనలను గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడే తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయిందన్నారు. (చదవండి: జేసీ ఆరోగ్యం కాపాడుకో..) -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
సాక్షి, మిడుతూరు: క్షణికావేశానికి లోనై ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కర్నూలుజిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య రాణి పుష్పలత (28) శుక్రవారం ఉదయం ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపారు. మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగి ఈమె కాలికి గాయమైంది. ఆ నొప్పి భరించలేక క్షణికావేశానికి లోనైన ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. మృతురాలి తల్లి నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలికి కూతరు తరళిత, కుమారుడు రితీష్ ఉన్నాడు. -
వార్డు సభ్యురాలి ఆత్మహత్య
మిడుతూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా మిడుతూరులో వార్డు సభ్యురాలు కృష్ణవేణి కుటుంబ కలహాల కారణంగా ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల వల్ల గత కొంతకాలంగా మనస్థాపానికి గురవుతున్న కృష్ణవేణి జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.