రాహుల్‌.. నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని వారినే మోసం చేశారు: కవిత | Kalvakuntla Kavitha Serious Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

రాహుల్‌.. నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని వారినే మోసం చేశారు: కవిత

Oct 8 2025 1:38 PM | Updated on Oct 8 2025 2:36 PM

Kalvakuntla Kavitha Serious Comments On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిరుద్యోగుల కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం.. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు వాళ్లు తగిన బుద్ధి చెబుతారని కామెంట్స్‌ చేశారు.

గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆందోళన చేపట్టింది. గన్ పార్క్‌ వద్ద నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నాకు దిగారు. ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు, గ్రూప్-1 అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వాలని మేము గన్ పార్క్ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ జాగృతి TGPSC ముట్టడి చేసినా ప్రభుత్వంలో చలనం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ.. బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దు.

రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నిరుద్యోగుల కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రిలీజ్‌ చేయలేదు. పాత ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చాము అని గొప్పలు చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. గ్రూప్-1 పరీక్షను తప్పుడుగా నిర్వహించారు. పరీక్ష రద్దు అయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచుతాము. తెలంగాణలో ఉన్న మేధావులు మౌనం వీడాలి. గ్రూప్-1 పరీక్షపై హరగోపాల్ సార్ మాట్లాడాలి. అవసరం అయితే నేను హరగోపాల్ సార్‌ను కలుస్తాను. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు నమ్మి తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కూలగొడుతారు.

త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తక్షణమే గ్రూప్ నియామకాలు రద్దు చేసి మళ్లీ గ్రూప్-1 పరీక్ష పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి, ప్రెసిడెంటల్ ఆర్డర్ ద్వారా 8 మంది ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రెసిడెంటల్ ఆర్డర్ పైన మేము ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement