ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఎందుకొచ్చిందంటే? : జగ్గారెడ్డి | Jagga Reddy Comments On Kavitha Bail | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఎందుకొచ్చిందంటే? : జగ్గారెడ్డి

Aug 27 2024 8:39 PM | Updated on Aug 27 2024 8:39 PM

Jagga Reddy Comments On Kavitha Bail

సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా డైరెక్షన్‌లోనే బెయిల్ వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కవితకు బెయిల్‌ రావడంపై జగ్గారెడ్డి స్పందించారు.‘‘లిక్కర్ స్కామ్ లో కవిత మెయిన్ విలన్. మోదీ, అమిత్ షా డైరెక్షన్ లోనే కవితకు బెయిల్ వచ్చింది. రాజకీయ చీకటి  ఒప్పందంలో భాగమే కవితకు బెయిల్ వచ్చింది. అదే మద్యం పాలసీ కేసులో  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు..15నెలలు వరకు  సిసోడియకు బెయిల్ ఇవ్వలేదు ..ఐదు నెలలకే కవితకు ఎందుకు బెయిల్ ఇచ్చారు’’ అని ప్రశ్నించారు.

‘కేసీఆర్ రాజకీయంగా కాంగ్రెస్‌ను ఢీకొనలేక బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ,బీఆర్ఎస్ అలయన్స్‌గా పోటీ చేస్తాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోయే భాగంగానే మద్యం పాలసీ కేసులో కవిత జైలు నాటకం’అని వ్యాఖ్యానించారు.

బెయిల్ రాక ముందే మూడు రోజుల నుండి బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.తీర్పు వెలువరించక ముందే కేసీఆర్ ,కేటీఆర్,హరీష్ రావు,బెయిల్ వస్తుందని లీక్ ఇస్తున్నారు.కేసీఆర్ కుటుంబంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి.

కవిత బెయిల్ అంశం దేశ రాజకీయాలలో కొత్తగా అనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించింది. కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులను న్యూట్రల్ చేసి బీజేపీకి ఓటు వేయించారు. ట్రబుల్ షూటర్ అంటున్న హరీష్ రావు ఇలాకాలో బీఆర్ఎస్ మూడవ స్థానంలో ఉంది. మోదీ తన బలం పెంచుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. బీజేపీ వెనుక ఉందనే ధైర్యంతో హరీష్ రావు, కేటీఆర్‌లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

 

Advertisement
 
Advertisement
Advertisement