ప్రపంచవ్యాప్తంగా రైట్‌వింగ్‌ నేతలపైనే టార్గెట్‌: అస్సొం సీఎం | Assam CM Himanta Biswa Sarma Says Right Wing Leaders Now Active Targets Over Trump Shot, See Details Inside | Sakshi
Sakshi News home page

ప్రపంచవ్యాప్తంగా రైట్‌వింగ్‌ నేతలపైనే టార్గెట్‌: అస్సొం సీఎం

Jul 14 2024 6:12 PM | Updated on Jul 14 2024 7:02 PM

Himanta Sarma says Right Wing Leaders Now Active Targets over Trump Shot

ఢిల్లీ: అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన కాల్పులను ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఖండించారు. 

తాజాగా ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై అస్సొం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు.  ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని ఎక్స్‌ వేదికగా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రైట్‌ వింగ్‌ నేతలను లెఫ్ట్‌ వింగ్‌ పార్టీలు టార్గెట్‌ చేస్తున్నాయని అ‍న్నారు. దేశమే తొలి ప్రాధాన్యం అనే జాతీయవాదాన్ని కలిగి ఉన్న నేతలను ఎవరు ఓడించలేరని తెలిపారు.

‘‘భౌతికంగా, మరోరకంగా ప్రపంచవ్యాప్తంగా రైట్‌ వింగ్‌ నేతలపై లెఫ్ట్‌ పార్టీ దాడులతో టార్గెట్‌ చేస్తోంది. ఈ దాడులు జాతీయవాదం కలిగి ఉండే నేతలను ఓడించలేవు. జాతీయవాదం అనేది పూర్తిగా ఆధ్యాత్మిక సనాతనతత్వం నుంచి ప్రేరణ పొందింది. డొనాల్డ్‌ ట్రంప్‌ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

 

ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన  ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్‌ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్‌ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.

ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్‌ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్‌ను షూట్‌ చేసినట్లు ఎఫ్‌బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు.

Advertisement
 
Advertisement
Advertisement