కేసీఆర్‌ రైతుబాంధవుడు: హరీశ్‌  | Harish Rao Comments Over Telangana CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ రైతుబాంధవుడు: హరీశ్‌ 

Sep 28 2021 2:02 AM | Updated on Sep 28 2021 2:02 AM

Harish Rao Comments Over Telangana CM KCR - Sakshi

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జోరు వానలో అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో పాల్గొంటున్న మంత్రి హరీశ్‌

హుజూరాబాద్‌/గజ్వేల్‌: ‘రాష్ట్రానికి సీఎంగా ఉన్నా కేసీఆర్‌ వ్యవసాయం చేస్తున్నారు. అప్పట్లో కరువు మంత్రిగా, రవాణా మంత్రిగా, కేంద్రమంత్రిగా ఉన్నా వ్యవసాయాన్ని విడవని రైతు మన సీఎం కేసీఆర్‌. ఆయన రైతు గనుకనే రైతుల కష్టాలు తెలుసు. నీటితీరువా, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా, రైతువేదికలు వంటివి ప్రవేశపెట్టిన రైతు బాంధవుడు కేసీఆర్‌. బీజేపీ మాత్రం రైతుల ఉసురు పోసుకుంటోంది’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు.

సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన విత్తనోత్పత్తి రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ కింద వారంలోపే రూ.50 వేల రుణాలను మిత్తి సహా చెల్లిస్తామని చెప్పారు. ఇక్కడ విత్తనోత్పత్తి రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌  పాల్గొన్నారు.  

చేనేతబీమా అమలు చేస్తాం 
రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు సైతం రూ. 5 లక్షల బీమాను అమలు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహావిష్కరణ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేతన్నల రుణమాఫీతోపాటు సబ్సిడీ ద్వారా ముడి సరుకులు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement