బిగ్‌షాక్‌.. ప్రతిపక్ష హోదా కోల్పోయిన మమతా బెనర్జీ | Expelled TMC MLA Ritabrata Banerjee becomes LoP | Sakshi
Sakshi News home page

బిగ్‌షాక్‌.. ప్రతిపక్ష హోదా కోల్పోయిన మమతా బెనర్జీ

Jun 3 2026 8:06 PM | Updated on Jun 3 2026 8:22 PM

Expelled TMC MLA Ritabrata Banerjee becomes LoP

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఇప్పటివరకు పార్టీని ఏకపక్షంగా నడిపించిన మాజీ సీఎం మమతా బెనర్జీ వర్గం ఒక వైపు, అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కించుకున్న రెబల్‌ ఎమ్మెల్యే రితాబ్రత బెనర్జీ వర్గం మరో వైపు  ఇలా టీఎంసీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఎమ్మెల్యే రితాబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ అసెంబ్లీ స్పీకర్‌ రథీంద్ర బోస్ తీర్మానించారు.

ఈ సందర్భంగా రితాబ్రత మీడియాతో మాట్లాడుతూ.. టీఎంసీ పార్టీ కన్వీనర్‌, ఎంపీగా ఉన్న అభిషేక్‌ బెనర్జీకి అసెంబ్లీతో సంబంధం లేదు. మే 6న మమతా బెనర్జీ నివాసంలో ఎలాంటి తీర్మానం జరగలేదు. మే 19న మాత్రమే మేం సంతకం చేశాం. మా సంతకాలు ఫోర్జరీ చేసి స్పీకర్‌కు లేఖ పంపారు. అందుకే అభిషేక్‌ బెనర్జీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

మే 6న పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో టీఎంసీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగిందని ప్రచారం జరిగింది. ఈ సమావేశంలో దీదీ వర్గానికి చెందిన సోభన్‌దేబ్ చటర్జీని ప్రతిపక్ష నేతగా, ఇతరులను డిప్యూటీ లీడర్స్, చీఫ్ విప్‌గా నియమించేందుకు పార్టీ ఎమ్మెల్యేలందరూ తీర్మానించారని తెలుపుతూ టీఎంసీ పార్టీ కన్వీనర్‌ అభిషేక్‌ బెనర్జీ అసెంబ్లీ స్పీకర్‌కి లేఖ ద్వారా సమాచారం పంపారు.

అయితే రితాబ్రత, సందీపన్ ఇద్దరూ ‘ఆ ప్రచారంలో వాస్తవం లేదు. దీదీ నివాసంలో మే 6న ఎలాంటి తీర్మానం జరగలేదు. మే 19న మాత్రమే మేం సంతకం చేశాం. మా సంతకాలు ఫోర్జరీ చేసి స్పీకర్‌కు అభిషేక్‌ బెనర్జీ లేఖ పంపారు. అందుకే ఆయన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’ అని స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ పరిణామం మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటివరకు ప్రతిపక్ష హోదా ఆమె ఆధీనంలోనే ఉండేది. కానీ రితాబ్రత బెనర్జీకి ఆ హోదా దక్కడంతో అసెంబ్లీ లోపల మమతా ప్రభావం తగ్గిపోతుంది. టీఎంసీ లోపల విభేదాలను మరింతగా బహిర్గతం చేస్తూ, మమతా నాయకత్వానికి సవాలు విసురుతోంది.

మమతా బెనర్జీకి ప్రతిపక్ష హోదా కోల్పోవడం వల్ల ఆమెకు ఉన్న ప్రతిష్ట, అధికారిక గుర్తింపు, అసెంబ్లీ వేదికపై ప్రత్యేక హక్కులు అన్నీ తగ్గిపోతాయి. ఇకపై ప్రతిపక్ష నేతగా రితాబ్రత బెనర్జీకి అధికారిక గుర్తింపు లభించడం, టీఎంసీ రెండుగా చీలిపోవడంతో మమతా బెనర్జీకి రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement