కోల్కతా: టీఎంసీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు మరో మలుపు తిరిగింది. ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ ఆధ్వర్యంలోని రెబెల్ వర్గం కోల్కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం స్వాధీనంలోకి తీసుకుంది. కార్యాలయం వెలుపల ఆ వర్గం నేతలతో కూడిన పోస్టర్లను అంటించడంతోపాటు తాళాలు వేసింది. ఆ పోస్టర్లపై మాజీ సీఎం మమతా బెనర్జీకి బదులుగా, పార్టీ చైర్పర్సన్గా ఎన్నుకున్న సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ ఫొటోలు ముద్రించారు.
కార్యాలయం ఆవరణలో ఉన్న మమత కటౌట్లు, పోస్టర్లను మాత్రం అలాగే వదిలేశారు. కార్యాలయం ఇకపై తమ అ«దీనంలోనే ఉంటుందని ప్రకటించింది. అంతకుముందు, సీనియర్ నేతలు ఫిర్హాద్ హకీం, జావెద్ ఖాన్, సాందీపన్ సాహా, అఖ్రుజ్జమాన్, రితబ్రత తదితరులు ఆఫీసులో సమావేశమయ్యారు. తమ వర్గమే అసలైన టీఎంసీ వారు మరోసారి ప్రకటించుకున్నారు. భవనం యజమానితో ఒప్పందం పనులు పూర్తయ్యాయని, ఇక నుంచి పారీ్టకి సంబంధించిన అన్ని సంస్థాగత కార్యకలాపాలు ఇక్కడి నుంచి జరుగుతాయని చెప్పారు.
ఇది తెలిసి మమత వర్గం నేత కునాష్ ఘోష్ అక్కడికి చేరుకోగా, గేటుకు తాళం వేసి కనిపించింది. దీంతో, ఆయన లోపలికి వెళ్లలేకపోయారు. ఈ పరిణామం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, పోలీసుల సాయంతోనే పార్టీ కార్యాలయాన్ని స్వా«దీనం చేసుకున్నారంటూ రెబెల్ వర్గాన్ని మమత గ్రూపు నిందించింది. పార్టీ పేరు, గుర్తు, సంస్థాగత నిర్మాణం అన్నీ తమకే చెందాలంటూ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ఎదుట వాదనలు వినిపించిన రెబెల్ వర్గం 24 గంటలైనా గడవకమునుపే ఈ పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీలో మెజారిటీ శాసనసభ్యులను కలిగిన టీఎంసీ రెబెల్ వర్గం సంస్థాగతంగా మరింత పట్టు బిగించేందుకే కార్యాలయాన్ని స్వాధీనంలోకి తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు.


