రామోజీ తప్పు చేస్తే ఉద్యోగులు బలిపశువులా?

Eenadu Ramoji Rao Selfish Politics With Chandrababu - Sakshi

విలువలు వదిలిన ఈనాడు ఇచ్చే సందేశం ఇదేనా?

పాత్రికేయం గురించి, దాని విలువల గురించి నిత్యం పాఠాలు వల్లించే ఈనాడు.. ఇప్పుడు అధమస్థాయికి చేరింది. తెలుగుదేశం, చంద్రబాబుల స్వార్థ ప్రయోజనాల కోసం పూర్తిగా దిగజారి క్షుద్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్నిదెబ్బ తీసేందుకు అసత్య ఆరోపణలను సృష్టించి వాటికి రకరకాల గ్రాఫిక్స్‌లు, పాత ఫోటోలను జోడించి వాటినే పాత్రికేయంగా ప్రదర్శిస్తూ ప్రజల ముందు నమ్మబలికే ప్రయత్నం చేస్తోంది ఈనాడు.

తాజాగా పట్టాభి ఎపిసోడ్‌లో రెండేళ్ల కిందటి ఫోటోలను ఫ్రంట్‌ పేజీలో ఘనంగా ప్రచురించింది ఈనాడు. చేసిన తప్పు సాక్షాలతో సహా, పూర్తి ఆధారాలతో సహా బయటపడే సరికి.. నంగనాచిలా కప్పి పెట్టే ప్రయత్నం చేస్తోంది. తప్పు చేసింది కేవలం ముగ్గురు ఉద్యోగులే అంటూ వారిపై వేటు వేసిందని తాజాగా వెలువడ్డ APWJF ప్రెస్‌ నోట్‌ ద్వారా తెలిసింది. ఈ వార్త ప్రచురణకు బాధ్యులంటూ అమరావతి డెస్క్‌ ఇన్‌ఛార్జి రామకృష్ణ, మరో ఇద్దరు సబ్‌ ఎడిటర్లు ఫణి, అప్పారావులను హుటాహుటిన విధుల నుంచి తప్పించినట్టు జర్నలిస్టు సంఘాల ద్వారా తెలిసింది.

ఈనాడు చర్యపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమన్నాయి. "పట్టాభి సంఘటనకు సంబంధించి ఏ పత్రికలోనూ ఈనాడులో వచ్చిన రీతిలో వార్తలు ప్రచురితం కాలేదు. కేవలం ఈనాడులో మాత్రమే ఈ వార్త ప్రత్యేక కథనంగా అనేక వివరాలతో పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ విధంగా ప్రత్యేక కథనం రూపొందించి వేయడం వెనుక యాజమాన్యం ప్రమేయం లేకుండా సాధ్యపడుతుందా? పతాక శీర్షికలో వేసే వార్తకు సంబంధించి ఎలాంటి సమస్య లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ తప్పు జరిగిందని బయటపడ్డాక దానికి డెస్క్‌ను ప్రత్యేకించి ముగ్గురు సిబ్బందిని బాధ్యులను చేయడం కేవలం జరిగిన తప్పుకు యాజమాన్యానికి ఎటువంటి బాధ్యత లేదని తప్పుకోవడమే తప్ప మరొకటి కాదు. వాస్తవాలు బయటకు వచ్చాక జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు సరైన మార్గం ఎంచుకోవాలే తప్ప పని చేసే సిబ్బందిని బలిపశువులుగా మార్చి బాధ్యత వారిపై నెట్టి విధుల నుంచి తొలగించడం తగదు" అని APWJF ప్రెస్‌ నోట్‌లో పేర్కొంది.

మొదటి నుంచి చంద్రబాబుతో రాసుకుతిరుగుతున్న రామోజీ.. తాజాగా తాలిబన్ల రాజ్యం అంటూ తన సంపాదకీయంలోనే రాసుకోవడంతో ఈనాడు పూర్తిగా బరితెగించిన విషయం పాఠకులందరికీ మరింత స్పష్టమయింది. పట్టాభి విషయంలో పాత ఫోటోలను అత్యంత లాఘవంగా వాడినప్పుడే రామోజీ కపటబుద్ధి బయటపడింది. చేసిన తప్పుకు ప్రాయశ్చితం చేసుకోవాల్సింది పోయి ఉద్యోగులను బలిపశువులను చేయడంలో వాడుకుని వదిలేసే బుద్ధి తెలిసిపోయింది. నిజానికి పట్టాభి వార్తలో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఈనాడు ఫ్రంట్‌ పేజీలోనే సమాధానాలు చెప్పగలదా?

1. ప్రభుత్వంపై బురద జల్లేందుకు పట్టాభిని వాడుకోవాలన్న కుట్ర ఎక్కడ ఆరంభమయింది? ఎవరి ఆదేశాలతో ఫ్రంట్‌ పేజీ డిజైన్‌ జరిగింది?

2. ఏ పత్రికలో రానంత ఘనంగా కవరేజీ ఇవ్వాలన్న ఆదేశం ఎక్కడినుంచి వచ్చింది?

3. ఫోటోల విషయంలో పత్రికా కార్యాలయాల్లో చాలా జాగ్రత్తలు ఉంటాయి. పాత ఫోటోలు యాధృచ్చికంగా వచ్చే అవకాశమే ఉండదు. అలాంటిది ఫ్రంట్‌ పేజీలో వేసే ఫోటోలను అత్యంత శ్రమ కోర్చి ఆర్కైవ్స్‌ నుంచి తీసి వాటిని ఫోటో షాప్‌ చేసి వాడిన ఘనులెవరు? ఎవరు చెబితే చేశారు?

4. కేవలం ముగ్గురు ఉద్యోగులే ఎలాంటి తప్పునయినా చేయగలరా? డెస్క్‌ ఇన్‌ఛార్జ్‌లు, ఎడిషన్‌ ఇన్‌ఛార్జ్‌లు, చీఫ్‌ ఎడిటర్లు, వీళ్లకు తోడు సుప్రీం ఎడిటర్‌ రామోజీ వీళ్లందరి ఆదేశాలు లేకుండానే ఇంతగా వండి వారుస్తారా?

5. ఆంధ్రప్రదేశ్‌ వరకు .. (గతంలో ఈనాడు ప్రాధాన్యతలను బట్టి చూస్తే) కేవలం జిల్లా వరకు పరిమితం చేయాల్సిన వార్తను అత్యంత ఘనంగా తీర్చిదిద్ది.. పాత ఫోటోలను పెట్టి, అసత్యాలను బొంకి.. దాన్ని తెలంగాణతో పాటు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఎడిషన్‌లోనూ వేసి ఎవరిని నమ్మించాలని ప్రయత్నించారు?

6. చింతిస్తున్నాం.. అంటూ మీరు చేసిన సవరణ ప్రకటన నమ్మదగ్గేలా లేదు. అయ్యో.. మా తప్పు బయటపడింది. ఇంత కష్టపడ్డా మేమేలా దొరికిపోయాం..? అన్న భావనే కనిపించలేదని మీరు అంగీకరించగలరా?

7. ఇంతకీ మీరు ముగ్గురిపై వేటు వేసింది .. అసత్యాన్ని సరిగ్గా బొంకలేదనా? లేక ఫోటోషాప్‌లో పట్టాభి ప్యాంటు రంగు కూడా ఎందుకు మార్చలేదనా? అంటే అబద్దాన్ని సరిగా చెప్పలేకపోయారన్నందుకు ముగ్గురి ఉద్యోగాలు ఊడగొట్టారా?

8. ఇలాంటి తప్పులు చేసి చట్టప్రకారం దొరికిపోతామన్న మీ విజనరీతోనే చీఫ్‌ ఎడిటర్‌ పదవి నుంచి ముందు జాగ్రత్తగా తప్పుకున్నారా? అంటే ఇక ముందు మీరు చేసే క్షుద్ర ఆలోచనలు బట్టబయలై మీ నిజస్వరూపం బయటపడితే.. కింది స్థాయి బకరాలను బయటకు పంపిస్తారా?

9. ఇన్ని అబద్దాలు ఆడి, అసత్యాలను ప్రచురించి.. ఈ మధ్య కాలంలోనే పదుల సార్లు ఆధారాలతో దొరికిపోయిన ఈనాడు కథనాలను చూసిన తర్వాత మీ పత్రిక చెప్పే వార్తలను ఏ విధంగా నమ్మాలి.? మీరు విషం చిమ్ముతున్నారన్న విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
చదవండి: చంద్రబాబు భయపడుతున్నారా?.. ఎందుకంత ఫ్రస్టేషన్‌?

అయ్యా రామోజీ, మీ పాత్రికేయంలో ఈనాడు దాదాపు అయిదు దశాబ్దాలుగా బాగానే ఉద్దరించింది. ఈ వయస్సులోనూ మీ కపట నీతిని ప్రజలకు ఇంకెన్నాళ్లు పూస్తూనే ఉంటారు? మీరు చేసిన దుష్ప్రచారాన్ని ఇంకెన్నాళ్లు ప్రజలు ఈసడించుకోవాలి? పాత్రికేయ ముసుగులో మీరు చేసే పనులు, మీ చేష్టలు వ్యక్తిగతంగానైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవా? సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత మీరు చేసే ప్రతీ పని ఆధారాలతో బయటపడుతుందన్న కనీస ఇంగీత జ్ఞానం మరిచిపోతున్నారా? ఇకనైనా మారండి. మారను అనుకుంటే.. అది మీ ఖర్మ. రెండు రాష్ట్రాలకు పట్టిన చీడగా ప్రజలు భావిస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top