
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు.. ఆయన దిగిపోయాక నేను ముఖ్యమంత్రిని కావడానికి ప్రయత్నం చేస్తాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసి కేసీఆర్ కూతురు మినహా ఆమెకు ఉన్న అర్హత ఏంటి? అని ప్రశ్నించారు.
తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. వచ్చే ఐదేళ్ల కోసం ఇప్పటకే తన అప్పీల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ముందు ఉంచారు. వచ్చే తొమ్మిదేళ్ల తర్వాత సీఎం కావాలనే టార్గెట్తో నేను పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రిగా రేవంత్ దిగిపోయాక.. నేను ముఖ్యమంత్రి స్థానం కోసం ప్రయత్నిస్తాను. ప్రజల దగ్గర అప్లికేషన్ పెడతాను.
బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఫోన్ ట్యాపింగ్తోనే నడిచింది. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిఘా పెట్టారు. నా ఫోన్ ట్యాప్ అయిందని చాలా సార్లు చెప్పారు.. పోలీసులే మాకు చెప్పేవారు. గత పదేళ్లు బీఆర్ఎస్.. పరిపాలనను గాలికొదిలేసి ఫోన్ ట్యాపింగ్ మీదే పడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ట్యాపింగ్తోనే పరిపాలన చేశారు. భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు రికార్డు చేశారు.
కవిత వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి. కవిత ఓవరాక్షన్ చేస్తున్నారు.. అంత అవసరం లేదు. కేసీఆర్ కూతురు మినహా మీకు ఉన్న అర్హత ఏంటి. కేసీఆర్, కేటీఆర్ రిజెక్ట్ చేసినా పొలిటికల్ ఇమేజ్ కోసం కవిత ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ స్థాయి ఒక్కటే. వారిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తే ఆర్థం ఉంది.. కవిత స్థాయి ఏంటి?. కవిత ఒక మాఫియా డాన్ అయిపోయింది. ఆమె వల్ల కేజ్రీవాల్, సిసోడియా ఖతమైపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు 5,6 నెలలకు వేసేవారు. మా ప్రభుత్వంలో 9 రోజుల్లోనే 9వేల కోట్లు జమ చేసాం. వారు చేయలేని పని కాంగ్రెస్ చేసిందనే అసూయతో హరీష్ రావు మాపై విమర్శలు చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
