పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి  | Congress celebrates 139th foundation day in Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి 

Dec 29 2023 2:00 AM | Updated on Dec 29 2023 2:01 AM

Congress celebrates 139th foundation day in Gandhi Bhavan - Sakshi

గాంధీ భవన్‌లో జరిగిన 139వ అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

సాక్షి,హైదరాబాద్‌: రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని, రాహుల్‌ గాందీని ప్రధాన మంత్రిని చేయాలని టీపీసీసీ నేతలు పిలుపునిచ్చారు. గురువారం గాంధీ భవన్‌లో 139వ అఖిల భారత జాతీ య కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సేవా దళ్‌ వందేళ్ల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, పార్టీ ఫిషరీస్‌ సెల్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జెండాను మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆవిష్కరించగా.. సేవాదళ్‌ ర్యాలీని జగ్గారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మా ట్లాడుతూ, 1885లో బొంబాయిలో 72 మందితో ఏర్పడిన కాంగ్రెస్‌ పార్టీ.. నేడు 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి.. బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిందన్నారు. స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఒకవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం, మరోవైపు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు చేసిన సేవలను ప్రజలు మరవలేరన్నారు. సోనియా గాం«దీ, పీవీ, మన్మోహన్‌సింగ్‌ లాంటి వారు దేశం కోసం నిరంతరం శ్రమించారన్నారు.  

మంత్రి  జూపల్లి శుభాకాంక్షలు 
భారత్‌.. ప్రపంచంలో సగర్వంగా నిలబడిందంటే కేవలం కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్లెనని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. మతతత్వ శక్తుల చేతిలో దేశం బందీగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement