సమయం, తేదీ, స్థలం, టాపిక్ డిసైడ్ చేస్తే చర్చకు సిద్ధం
సీఎం రేవంత్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
మీరు చెప్పే లెక్కలన్నీ తప్పు అని నిరూపించకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా
అప్పులు, చెల్లింపుల లెక్కలన్నీ అబద్ధాలే..
కాగ్, ఆర్బీఐ చెప్పేదానికి సీఎం, డిప్యూటీ సీఎం చెప్పే వాటికి పొంతన లేదు
రాష్ట్రాధినేతగా ఉంటూ రాష్ట్రాన్ని కించపర్చేలా మాట్లాడటం మొదటిసారి చూస్తున్నా
రేవంత్ మానసిక స్థితి బాగా లేదేమో..
సీఎంకు దమ్ముంటే మద్య నిషేధం విధించాలని డిమాండ్
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నానని, పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. అప్పులు, పాలనా వైఫల్యాలు, రైతుల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక పరిస్థితి దేనిపైనైనా సరే చర్చకు వరంగల్ చౌరస్తానా? అశోక్నగర్ చౌరస్తానా? అసెంబ్లీ, ప్రెస్క్లబ్, కొత్తగా రూ.200 కోట్లతో కట్టుకున్న సీఎం ఇంద్రభవనంలో అయినా చర్చకు సిద్ధమని అందుకు తేదీ, సమయం, ప్రాంతం సీఎం చెప్పాలని ఏ టాపిక్ అయినా సరే చర్చకు సిద్ధమని, ప్రభుత్వం వైఫల్యాలను గణాంకాలతో నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నారు. బుధవారం తెలంగాణభవన్లో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్యాదవ్, వివేకానంద తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి నల్లగొండ సభ, శిల్పకళావేదిక సభలో బీఆర్ఎస్, కేసీఆర్ను విమర్శించడంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అప్పులకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పే సంఖ్యలో తేడాలున్నాయని, వీరిద్దరూ చెప్పే దానికి పార్లమెంట్లో వీరి చీకటి మిత్రుడు రఘునందన్రావు అడిగిన ప్రశ్నకు కేంద్రం కాగ్, ఆర్బీఐ నుంచి తీసుకొని ఇచ్చిన లెక్కలకు చాలా తేడాలున్నాయన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.72 వేల కోట్లు అయితే.. తాము దిగిపోయేనాటికి ఉన్న అప్పులు మొత్తం రూ.3.5 లక్షల కోట్లు అని, తమ పదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.2.78 లక్షల కోట్లు అని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రైతులకు రూ.1.75 లక్షల కోట్లు వ్యయం చేశారంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.1.56 లక్షల కోట్లు వ్యయం చేశారంటున్నారని, ఇద్దరి మధ్య ఐదు నిమిషాల వ్యవధిలోనే రూ.20 వేల కోట్ల తేడా చెబితే ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. నెలకు అప్పులు, అసలు కింద ఈ ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.2,500 కోట్లలోపు ఉంటుందని కాగ్ నివేదిక చెబుతుంటే.. వీరు బయట మాత్రం రూ.6,000 కోట్లు చెల్లిస్తున్నారని అన్ని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
సీఎం కుటుంబం, మంత్రుల దోపిడీతోనే...
సీఎం రేవంత్రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ నేతల దోపీడి వల్లనే తెలంగాణ దివాలా తీస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్రెడ్డి భావదారి్రద్యంతో మాట్లాడుతూ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దివాలా, ఎయిడ్స్ రోగి, కేన్సర్ పేషెంట్ అంటూ తాను పాలించే రాష్ట్రం గురించి ఏ ముఖ్యమంత్రి ఇంత నీచంగా మాట్లాడరన్నారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి, మరి 72 సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి మాటలు చూస్తుంటే ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆయనకు మానసిక జబ్బు ఉందేమో అన్న అనుమానం వస్తుందని కేటీఆర్ అన్నారు.
రైతాంగం తీవ్ర సంక్షోభంలో..
కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, అట్లాంటి పరిపాలనకు సంబరాల పేరిట బలవంతపు కార్యక్రమాలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. మొన్నటికి మొన్ననే సంపూర్ణంగా రైతుబంధు వేస్తాను..అందరికీ ఇస్తాను అని చెప్పి కేవలం ఒక ఎకరానికి ఇచ్చి, ఒక్కొక్క ఎకరానికి డబ్బులు వేసిన ప్రతిసారి సంబరాలు చేసుకుంటూ ఉత్త మాటలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఎవరికీ డబ్బులు లేవు కానీ... రాహుల్గాంధీకి మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానంటూ రేవంత్ చెబుతున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. రేవంత్రెడ్డి పాలన మాత్రం పాతాళానికి పడిపోతుందని చెప్పారు. అది రాష్ట్ర ఆదాయం అయినా కావొచ్చు...రియల్ ఎస్టేట్ రంగం కావొచ్చు...చివరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జీఎస్టీ వసూలు ఇలా ప్రతి ఒక్క రంగంలో మందగమనం ఉందన్నారు. రేవంత్రెడ్డి పాలనలో మిగిలింది మందగమనం, మందు గమనం తప్పించి ఇంకేమీ లేదన్నారు. రేవంత్రెడ్డి ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతున్నారన్నారు. నిజంగానే రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని, మద్యం అమ్మకాలను నిషేధించాలని కేటీఆర్ సవాలు విసిరారు.
నాలుక మడత తిప్పిన రేవంత్రెడ్డి
ధాన్యం ప్రతి గింజా కొంటాం..తాము సేకరించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై పోరాడుతాం అన్న సీఎం రేవంత్రెడ్డి..ఇప్పుడు కేంద్రం ఎంత కోటా ఇస్తే అంతే కొంటాం అంటూ నాలుక మడత తిప్పారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ అంగుష్ట మాత్రుడని, ఆయన నోరు మూసీ కంపుకంటే ఘోరం అని వ్యాఖ్యానించారుం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేబినెట్ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఎత్తు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 18,500 కోట్లకు ఆదాయం పెంచాం
రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు వచ్చే నెలసరి ఆదాయం రూ.4 వేల కోట్లు అయితే, తాము దిగిపోయేనాటికి ఆ ఆదాయాన్ని రూ.18,500 కోట్లకు పెంచామని కేటీఆర్ అన్నారు. జీఎస్డీపీని రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్లకు చేర్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులకు గడిచిన 30 నెలల్లోనే రూ.1.13 లక్షల కోట్ల బకాయి పడిందన్నారు. రైతుబంధు కింద రూ.30 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.22వేల కోట్లు, రుణమాఫీ రూ.29 వేల కోట్లు, ధాన్యానికి బోనస్ రూ.16 వేల కోట్లు, కూలీలకు రూ.15 వేల కోట్లు బకాయిపడ్డారని చెప్పారు.


