జైపూర్: రాజస్థాన్లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. అధికార బీజేపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. తాజా ఫలితాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 41 శాతం వార్డులలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 35 శాతానికే పరిమితమైంది.
గత స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ తన ఓటు శాతంలో సుమారు 5 శాతం కోల్పోయింది. రాజస్థాన్లో చివరి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కొత్తగా 2,770 వార్డులు (37శాతం పెరుగుదల) చేరాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం వార్డుల సంఖ్య 10,244కి చేరింది.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తొలిసారి జరిగిన మొత్తం 10,244 స్థానాల్లో 4,179 వార్డులను కైవసం చేసుకుని, మొత్తం స్థానాల్లో 40.8% వాటాను దక్కించుకుంది. గతంతో పోలిస్తే బీజేపీ గెలిచిన స్థానాల సంఖ్య ఏకంగా 57శాతం పెరిగింది. కాంగ్రెస్ 3,613 వార్డులను మాత్రమే గెలుచుకుని 35.3శాతం వాటాను సొంతం చేసుకుంది.
గత ఎన్నికలతో పోలిస్తే పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఏకంగా 2,273 వార్డులలో గెలుపొంది 22.2శాతం వాటాను సాధించారు. మొత్తం మీద కాంగ్రెస్ కంటే బీజేపీ 566 వార్డులు ఆధిక్యంలో నిలిచింది. ప్రధాన పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ,సీపీఐ(ఎం),రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ వంటి ఇతర పార్టీలు సైతం కొన్ని ప్రాంతాల్లో మంచి స్థానాలను కైవసం చేసుకున్నాయి.


