మహారాష్ట్ర ఎంఎల్‌సీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ | BJP loses key Nagpur MLC seat to Congress | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ఎంఎల్‌సీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ

Dec 5 2020 5:18 AM | Updated on Dec 5 2020 5:18 AM

BJP loses key Nagpur MLC seat to Congress - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన ఆరు స్థానాలకు జరిగిన ఎన్ని కల్లో నాలుగు స్థానాలు మహావికాస్‌ ఆఘాడి (కాంగ్రెస్‌–ఎన్సీపీ–శివసేన), ఒక స్థానం  స్వతంత్ర అభ్యర్ధి, ఒక స్థానం బీజేపీ కైవసం చేసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు ఒక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కరోనా మహ మ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించిన అనంతరం జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో మహావికాస్‌ ఆఘాడిలో నూతన ఉత్సాహం నిండింది. డిసెంబర్‌ 1న జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభం కాగా బీజేపీకి తొలి విజయం దక్కింది.

ధులే–నందుర్బార్‌ స్థానిక సంస్థ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమరీష్‌ పటేల్‌ విజయం సాధించారు. అయితే మిగిలిన స్థానాల్లో మాత్రం బీజేపీ ఓటమిపాలైంది. ముఖ్యంగా పెట్టని కోటగా ఉండే నాగపూర్, పుణే, ఔరంగాబాద్‌లలో బీజేపీకి షాక్‌నిస్తూ మహావికాస్‌ ఆఘాడి విజయ ఢంకా మోగించింది. పుణే పట్టభద్రుల నియోజకవర్గంలో మహావికాస్‌ ఆఘాడికి చెందిన ఎన్సీపీ అభ్యర్థి అరుణ్‌ లాడ్‌ విజయం సాధించారు.  సుమారు 60 ఏళ్ల అనంతరం నాగపూర్‌లో బీజేపీ పరాజయం పాలైంది. ఈ నియోజకవర్గంలో మహావికాస్‌ ఆఘాడికి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి అభిజిత్‌ వంజారీ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సందీప్‌ జోషిపై విజయం సాధించారు. అమరావతి టీచర్ల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధి కిరణ్‌ సర్నాయక్‌ గెలుపొందారు.

Advertisement
 
Advertisement
Advertisement