దేశాన్ని మోసగించడానికే బీఆర్‌ఎస్‌ 

BJP Chief Bandi Sanjay Slams Telangana CM KCR Over BRS Party - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

మెట్‌పల్లి(కోరుట్ల): ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ఇప్పటివరకు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ వచ్చిన సీఎం కేసీఆర్‌.. దేశ ప్రజలను మోసగించడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. హామీలు ఎందుకు నెరవేర్చలేదో రాష్ట్ర ప్రజలకు ముందుగా కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. ఐదోవిడత ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జరిగిన సభలో మాట్లాడారు.

దళిత ముఖ్య మంత్రి, దళితులకు మూడెకరాలు, రైతు రుణమాఫీ, అర్హులందరికీ డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి, ఉచితంగా ఎరువుల పంపిణీ, పోడుభూములకు పట్టాలు వంటి హామీలు ఏమయ్యాయని బండి ప్రశ్నించారు. తెలంగాణను దేశానికి మోడల్‌గా చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్‌ మిగులు ఆదాయమున్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని సంజయ్‌ దుయ్యబట్టారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదన్నారు. పంజాబ్‌లో రైతులకు ఆర్థిక సాయం పేరిట చెల్లని చెక్కులు అందజేసి తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. తండ్రికి ఇష్టమైన వ్యాపారమే చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్, క్యాసినోలో అవినీతి సొమ్మును పెట్టుబడిగా పెట్టా రని ఆరోపించారు. ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లి ఇబ్బందులు పడుతున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయలేదని సంజయ్‌ ప్రశ్నించారు. ఈ నెల 15న కరీంనగర్‌లో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని సంజయ్‌ వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top