ఏపీ బీజేపీలో బిగ్‌ ట్విస్ట్‌.. ఇన్‌ఛార్జ్‌గా తెలంగాణ కీలక నేత? | AP BJP Chief Muraleedharan Talks About Position Change | Sakshi
Sakshi News home page

ఏపీ బీజేపీలో బిగ్‌ ట్విస్ట్‌.. ఇన్‌ఛార్జ్‌గా తెలంగాణ కీలక నేత?

Aug 12 2023 9:07 PM | Updated on Aug 12 2023 9:07 PM

AP BJP Chief Muraleedharan Talks About Position Change - Sakshi

బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్‌ తనను బాధ్యతలనుంచి తొలగించమని కోరుతున్నారా?. ఐదేళ్ళుగా ఇన్‌చార్జ్‌ పదవిలో కొనసాగుతున్న ఆ కేంద్ర మంత్రి ఏపీకి రావడం తగ్గించేశారు ఎందుకని?. ఆయన పనితీరు మెచ్చి కేంద్రం ఇచ్చిన అదనపు బాధ్యతను బరువుగా ఎందుకు భావిస్తున్నారు?. ప్రస్తుత ఇన్‌చార్జ్‌ని తప్పిస్తే.. కొత్త ఇన్‌చార్జ్‌గా ఎవరు రాబోతున్నారు?..

కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ 2018 నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉంటూనే ఇన్‌ఛార్జ్‌గా చురుగ్గానే వ్యవహరించేవారు. అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ, ఆ తర్వాత సోము వీర్రాజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నపుడు వారితో కలిసి పనిచేశారు. ఇపుడు పురంధేశ్వరి అధ్యక్షురాలిగా ఉన్నారు. 

ఏపీ ఇన్‌ఛార్జ్‌గా రెండేళ్లపాటు చురుగ్గానే వ్యవహరించిన కేంద్ర మంత్రి మురళీధరన్ ఆ తర్వాత ఏపీ రావడం తగ్గిస్తూ వచ్చారు. మొదట్లో నెలకొకసారి వచ్చిన మురళీధరన్ ఇపుడు మూడు నెలలకొకసారి కూడా ఏపీకి రావడంలేదు. కాగా ఏడాదిన్నరగా ఏపీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించమని పార్టీ హైకమాండ్‌ను మురళీధరన్ కోరుతున్నారట. ఏపీ బీజేపీలో వెన్నుపోటు రాజకీయాలు భరించలేకే ఆయన ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి తప్పించమని కోరుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

చంద్రబాబే కారణమా?..
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక.. తమ అవసరాల కోసం చంద్రబాబు సూచనల మేరకు బీజేపీలో చేరిన‌ టీడీపీ కోవర్డు గ్యాంగ్ వల్లే మురళీధరన్ ఏపీకి రావడం తగ్గించేశారని టాక్ నడుస్తోంది. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందో మురళీధరన్ కంటే పచ్చ బ్యాచ్‌కే ముందుగా తెలుస్తోందట. అటు కేంద్రంలోని పెద్దలతో సన్నిహితంగా ఉంటూ, ఇటు ఎల్లో మీడియాకి లీకులిస్తూ ఎప్పటికపుడు తమ‌ పాత బాసుకి అన్ని విషయాలు చేరవేస్తుండటం‌ మురళీధరన్‌కి చాలా ఇబ్బందిగా మారిందట. 

దీనిపై ఢిల్లీలోని పెద్దలతో మాట్లాడిన మురళీధరన్ ఏపీ పార్టీలోని వెన్నుపోటు రాజకీయాలని కంట్రోల్ చేయాలని సూచించారట. అదే సమయంలో తనను ఏపీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా అధిష్టానాన్ని‌ కోరారట. అయితే, బీజేపీ కేంద్ర నాయకత్వం ఇవేమీ పట్టించుకోకపోవడం.. రాష్ట్ర పార్టీలో పచ్చ బ్యాచ్ హవా పెరుగుతుండటంతో ఇక మురళీధరన్ రాష్ట్రానికి రావడమే తగ్గించేశారని తెలుస్తోంది.

తెర మీదకు బండి సంజయ్‌..
ఎన్నికలకు ఇంకా నెలల సమయం‌ మాత్రమే మిగిలి ఉండటంతో పలు రాష్ట్రాల్లో ఇన్‌ఛార్జ్‌లను సహ ఇన్‌ఛార్జ్‌లని కూడా మార్చడానికి బీజేపీ అధిష్టానం‌ కసరత్తులు చేస్తోంది. ఏపీలో పార్టీ అధ్యక్షుడిని ఎలాగూ మార్చారు గనుక ఎన్నికల ముందు కొత్త టీంకి అవకాశమిచ్చి తనని తప్పించాలని మురళీధరన్‌ కోరుతున్నారట. అదే సమయంలో ఎల్లో బ్యాచ్ ఆట కట్టించడానికి.. లీకు వీరుల పని పట్టడా‌నికి... కొత్త టీంని పరుగులు పెట్టించడానికి ఏపీ ఇన్‌ఛార్జ్‌గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బండి సంజయ్ పేరు పరిశీలనలో ఉందంటున్నారు. 

ఇటీవలే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా దక్కించుకున్న బండి సంజయ్ ఏపీ ఇన్‌ఛార్జ్‌ రేసులో ఉన్నారంటున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకం‌ కావడంతో బండి సంజయ్‌ని తెలంగాణ ఎన్నికలు ముగిసే వరకు అక్కడ నుంచి కదపక పోవచ్చునని మరో టాక్. మరి ఏపీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్న మురళీధరన్ ఆశలు నెరవేరుతాయా?.. బీజేపీ అధిష్టానం‌ ఒప్పుకుంటుందా? కొత్త ఇన్‌చార్జ్‌ని నియమిస్తుందా లేదా అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి: ఏపీలో నీకు కనీసం ఇల్లు కూడా లేదు.. కోర్టు కంటే గొప్పోడివా?: రోజా ఫైర్‌

Advertisement
 
Advertisement
Advertisement