
గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.
సోమవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్సార్సీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.
గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.
ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రొత్సహంతో వైఎస్సార్సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్ పర్సన్గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు.
