మంచి పనులకు అడ్డు తగిలితే ఎలా?

Adimulapu Suresh Comments On TDP - Sakshi

టీడీపీ తీరుపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపాటు

విద్యా వ్యవస్థ బలోపేతాన్ని కేసులతో అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం  

సాక్షి, అమరావతి: ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే టీడీపీ నేతలు పదేపదే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. సంస్కరణల ద్వారా విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి పటిష్టపరుస్తుంటే.. టీడీపీ నాయకులు అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెనలపై కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ముద్ర వేశారన్నారు.

ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లను సీఎం జగన్‌ అందించారని చెప్పారు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నా కూడా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ప్రతి బిడ్డా ఒక హక్కుగా చదువుకునే వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పిస్తున్నామని తెలిపారు.

ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులు ఎదిగేందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తున్నామన్నారు. రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ మాత్రమే కాకుండా రైట్‌ టూ ఇంగ్లిష్‌ మీడియంను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. కాగా, సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు శృతి మించాయని మంత్రి సురేష్‌ మండిపడ్డారు. అరాచకాలు, దౌర్జన్యాలు టీడీపీ సంస్కృతి అని విమర్శించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top