రాష్ట్రంలో అధికార పార్టీల పెద్దలే డ్రగ్ డాన్లు
మత్తు పదార్థం స్మగ్లింగ్కు గేట్ వేగా ఏపీ
దక్షిణాది రాష్ట్రాలతో పాటు గోవాకూ సరఫరా
అల్లూరి జిల్లాలో ఏజెంట్ల వ్యవస్థ
ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా దిగుమతి
ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు సరఫరా
ఏటా రూ.25వేల కోట్ల దందా.. విద్యాసంస్థలే లక్ష్యం.. మత్తులో జోగుతున్న రాష్ట్రం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే, ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి గంజాయి తాగుతూ అడ్డంగా దొరికాడు.
⇒ భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ కూడా గత ఏడాది డ్రగ్స్ గ్యాంగ్తో దొరికినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.
⇒ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత కుటుంబ సభ్యులు అల్లూరి జిల్లాలో గంజాయి అక్రమ సాగు, స్మగ్లింగ్ దందా సూత్రధారులు.. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో గంజాయి మాఫియా జడలు విప్పుతున్న తీరుకు ఇవి కొన్ని ఉదాహరణలు. కూటమి కీలక నేతల కుటుంబ సభ్యులు, వారసులే రింగ్ మాస్టర్లుగా భారీస్థాయిలో మత్తు దందా సాగుతున్న వైనానికి నిదర్శనాలు. వెరసి బాబు సర్కారు.. ఆంధ్రప్రదేశ్ను గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్కు రాజధానిగా మార్చివేసింది. మొత్తమ్మీద పచ్చ మాఫియా ఏటా రూ.25 వేల కోట్ల దందాకు పాల్పడుతోందని అంచనా.
టీడీపీ కూటమిలోని కీలక నేతల కుటుంబసభ్యులు గంజాయి డాన్లుగా చెలరేగుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా... ఇలా ఎక్కడ మత్తు బాగోతం బయటపడినా వీరి పాత్ర బట్టబయలవుతోంది. ఓవైపు కూటమి నేతల కుటుంబ పెద్దల ఆధ్వర్యంలో రాష్ట్రం నుంచి గంజాయి స్మగ్లింగ్ సాగుతుంటే, మరోౖవెపు ఆ కీలక నేతల వారసులు హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో మకాం వేసి రవాణా చానెల్ను పర్యవేక్షిస్తున్నారు. పనిలోపనిగా ‘దమ్ మారో దమ్’ అంటూ గంజాయి, డ్రగ్స్తో జల్సా చేస్తున్నారు
దక్షిణాది రాష్ట్రాలు దాటి..
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) దెబ్బకు గంజాయి సిండికేట్ తోకముడిచి పరారైంది. కానీ, 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే టీడీపీ గంజాయి మాఫియా అడుగుపెట్టింది. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్మగ్లింగ్ దందా సాగించిన టీడీపీ నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. ఈ ముఠా అల్లూరి జిల్లాలో గంజాయి సాగును పునఃప్రారంభించింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా మత్తు పదార్థం తెప్పిస్తూ ఎంపిక చేసిన మార్గాల్లో రాష్ట్రంలోని జిల్లాలు, దక్షిణాది రాష్ట్రాలు, గోవాకు సరఫరా చేస్తోంది. అంటే... బాబు సర్కారు గంజాయి రవాణాకు రాష్ట్రాన్ని గేట్వేగా మార్చేసింది
కేంద్రం సూచనలు బేఖాతరు
సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లోని 18 ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ సూచించింది. కానీ, దీనిని చంద్రబాబు ప్రభుత్వం 8 చెక్పోస్టులతో సరిపెట్టింది. మిగిలిన పది కీలక ప్రాంతాల గుండా అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్కు తలుపులు బార్లా తెరిచింది. పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం టీడీపీ మాఫియా అల్లూరి జిల్లా నుంచి దక్షిణాది రాష్ట్రాలకు భారీగా గంజాయి రవాణా చేస్తున్న 3 ప్రధాన మార్గాలు... ఏవోబీ–ఏఎస్ఆర్ జిల్లా–అనకాపల్లి జిల్లా (చెన్నై–కోల్కతా హైవే)– చెన్నై/బెంగళూరు–కేరళ, ఏవోబీ–ఏఎస్ఆర్ జిల్లా సీలేరు–భద్రాచలం–హైదరాబాద్–పుణె/ముంబై, ఏవోబీ–రంపచోడవరం– రాజమహేంద్రవరం– చెన్నై.
ఏడాదికి రూ.25 వేల కోట్లు.. టీడీపీ గంజాయి మాఫియా దోపిడీ
కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు అనధికారికంగా వెల్లడించిన ప్రకారం 2024–25లో ఏవోబీ నుంచి రూ.8 వేల కోట్ల విలువైన గంజాయిని దేశంలోని వివిధ ప్రాంతాలకు స్మగ్లింగ్ చేశారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.25 వేల కోట్లు. ఇక 2025–26లో రాష్ట్రం నుంచి సగటున నెలకు రూ.2 వేల కోట్ల విలువైన ‘సరుకు’ స్మగ్లింగ్ చేస్తున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనికోసం టీడీపీ గంజాయి మాఫియా అల్లూరి జిల్లాలో ఏజెంట్ల వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించింది.

కేరళ, కర్ణాటక, తమిళనాడు వారిని ఎంపిక చేసుకుని ఏజెన్సీలో అద్దె ఇళ్లు, ఇతర సౌకర్యాలు సమకూర్చింది. ఈ ఏజెంట్లు అల్లూరి జిల్లాతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్లో గంజాయి పండించే వారిని సంప్రదించి భారీగా కొనుగోలు చేసి, దక్షిణాది రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, గోవాలలో పోలీసులు అరెస్టు చేసిన పెడ్లర్లు అందరూ వారికి ఏపీ నుంచే గంజాయి వస్తోందని చెప్పడం గమనార్హం. వీరిచ్చిన వివరాలతో ఏఎస్ఆర్ జిల్లా కేంద్రంగా సాగుతున్న వ్యవస్థీకృత మాఫియా బాగోతం బట్టబయలైంది.
విద్యా సంస్థలకు గంజాయి ముప్పు
ఏపీలో గంజాయి మార్కెట్ విస్తరణపై టీడీపీ మాఫియా దృష్టిపెట్టింది. ఇందుకోసం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేతల ప్రధాన అనుచరులు ఇతర జిల్లాల్లోని వారి పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో నెట్వర్క్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థలను గంజాయి విక్రయాలకు మార్కెట్గా చేసుకున్నారు. విశాఖ, విజయనగరం, విజయవాడ, రాజమహేంద్రవరం తదితర జిల్లా కేంద్రాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక ప్రత్యేకంగా వెండర్లను ఎంపిక చేసుకున్నారు. పాన్షాపులు, చిన్నచిన్న హోటళ్లు, సంచార వర్తకులు... ఇలా పలువురిని నెట్వర్క్లో భాగం చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు.
గంజాయి దందాను పెకలించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం
2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ఏర్పాటు చేసి గంజాయి మాఫియా ఆటకట్టింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దున... మన రాష్ట్ర పరిధిలో దశాబ్దాలుగా సాగిన గంజాయి సాగును సమర్థంగా కట్టడి చేసింది. ఆపరేషన్ పరివర్తన్ పేరిట ప్రత్యేక కార్యాచరణను రెండు దశల్లో విజయవంతంగా నిర్వహించింది. 2019 నాటికి రాష్ట్రంలో దాదాపు 12వేల ఎకరాల్లో గంజాయి సాగయ్యేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 11,800 ఎకరాల్లో గంజాయి సాగును పెకలించి వేసింది. రూ.150 కోట్లతో గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. 2024 నాటికి గంజాయి సాగు కేవలం 50 ఎకరాలలోపునకు పరిమితం కావడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.


