కోల్సిటీ: విద్యార్థులకు విద్యాబోధన అందించే పాఠశాలలు, ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల సంఘం నాయకులు కోరారు. ఇటీవల నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, శుక్రవారం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాను కలిసి వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతపై యాజమాన్యాలకు ఆందోళన లేకుండా పోలీస్ శాఖ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా పాఠశాలల వద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారాన్ని నియంత్రించడంతో పాటు, విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతకు ముప్పు కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడంతో పాటు, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించాలని విన్నవించారు. ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందారపు యాదగిరిగౌడ్, జిల్లా అధ్యక్షుడు కంది రవీందర్రెడ్డి, స్థానిక అధ్యక్షుడు అదర్సండే సమ్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చందుపట్ల తిరుపతిరెడ్డి, స్థానిక ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావుతోపాటు పలువురు కరస్పాండెంట్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు.


