
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ భరోసా
● టన్ను బొగ్గుపై రూ.20 చెల్లించేందుకు ఆదేశాలు ● రామగుండం ప్రాంతంలో 65 వేల మంది పింఛన్దారులు
గోదావరిఖని: కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్(సీఎంపీఎఫ్) బోర్డు, కోలిండియా యాజమాన్యం గత జనవరిలో హైదరాబాద్ సింగరేణి భవన్లో సమావేశమయ్యాయి. సీఎంపీఎఫ్ ట్రస్ట్లో లోటు బడ్జెట్ను అధిగమించేందుకు పింఛన్ నిధి పెంచు కోవాలని నిర్ణయించాయి. దీంతో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కమిషనర్ విక్రమ్దేవదత్ ఆదేశాలతో కోలిండియా యాజమాన్యం స్పందించింది. అప్పటివరకు టన్ను బొగ్గుపై రూ.10 ఉన్న పింఛన్ ఫండ్ను రూ.20కు పెంచింది. అంతేకాకుండా.. రెండునెలలుగా కోలిండియా దీనిని అమలు చేస్తోంది. గత శుక్రవారం ఢిల్లీలో జరిగిన సీఎంఫీఎఫ్ సమావేశంలో సింగరేణి సీఎండీ బలరాం.. కోలిండియా సూచనల మేరకు స్పందించారు. టన్ను బొగ్గుపై రూ.20 చెల్లించేందుకు అంగీకరించారు. ఈమేరకు సింగరేణిలో ఆదేశాలు జారీ అయ్యాయి. వచ్చేనెల నుంచి నిధులు జమచేసేందుకు సీఎండీ నిర్ణయం తీసుకున్నారు.
సీఎంపీఎఫ్లో రూ.22,452 కోట్ల మూలనిధి
సీఎంపీఎఫ్లో ప్రస్తుతం రూ.22,452 కోట్ల మూలనిధి ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కోలిండియాలో 5.4లక్షల మంది, సింగరేణిలో 84వేల మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. మరో ఆరేళ్లలో వారిసంఖ్య మరింత పెరుగుతుంది. అప్పటివరకు పింఛన్ ఫండ్లో లోటు ఏర్పడుతుందని ట్రస్ట్ ప్రతినిధులు భావిస్తున్నారు. అందుకే.. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది.