
మాట్లాడుతున్న డీసీపీ చేతన
గోదావరిఖని: ఎన్నికల నిబంధనలకు లోబడి పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని పెద్దపల్లి డీసీపీ చేతన సూచించారు. మంగళవారం స్థానిక రాజ్యలక్ష్మి గార్డెన్లో పోలింగ్ బందోబస్తు పోలీసులతో నిబంధనలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. డీసీపీ మాట్లాడుతూ ఓటర్లు, రిటర్నింగ్ అధికారి, పోలింగ్ ఏజెంట్లు తప్ప ఇతరులను లోనికి అనుమతించరాదన్నారు. వాహనాలను 200మీటర్ల దూరంలోనే ఉంచాలన్నారు. ఇతర పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులు వస్తే అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. వంద మీటర్ల లోపు కండువాలు, ప్రచారం లేకుండా చూసుకోవాలన్నారు. గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వన్టౌన్ సీఐ ప్రమోద్రావు, టూటౌన్ సీఐ వేణుగోపాల్, ఎన్టీపీసీ సీఐ చంద్రశేఖర్, మంథని సీఐ సతీశ్ పాల్గొన్నారు.
ఓటరు కార్డులేకున్నా ఓటేయొచ్చు
పెద్దపల్లిరూరల్: ఓటరు జాబితాలో పేరు ఉండి, ఓటరు కార్డు లేకున్నా.. ప్రభుత్వం జారీచేసిన 12రకాల ఫొటోతో కూడిన కార్డుల్లో ఏదో ఓదానిని చూపించి ఓటు వేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ఆధార్కార్డు, ఉపాధిహామీ జాబ్కార్డు, బ్యాంకు, పోస్టాఫీసు జారీచేసిన పాసుబుక్కు, కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్యబీమా స్మార్ట్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, ఎన్పీఆర్ ద్వారా ఆర్బీఐ జారీచేసిన స్మార్ట్కార్డు, పాస్పోర్ట్, పింఛన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ల ఉద్యోగుల ఐడీ కార్డులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఐడీ కార్డులు, ప్రత్యేక వైకల్యంగల ఐడీకార్డులను చూపి ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
టేబుల్ ఇన్చార్జిలకు శిక్షణ
గోదావరిఖని: ఎన్నికల టేబుల్ ఇన్చార్జిలకు మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్ల సంఖ్యను ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, సాంకేతిక లోపాలు, అసాంఘిక కార్యక్రమాలు, ఇబ్బందులను తలెత్తితే తక్షణమే సెక్టార్ అధికారికి సమాచారం ఇవ్వాలన్నారు. ఈసీఐఎల్ ఇంజినీర్లు, మాస్టర్ ట్రైనర్ల సమక్షంలో సెక్టార్ అధికారులకు ఈవీఎం పరికరాలు, సీయూ, బీయూ, వీవీపాట్లను పంపిణీ కేంద్రాలకు తీసుకువెళ్లే సమయంలో అడ్రస్ టాగ్, వరుస సంఖ్య పోల్చుకొని తీసుకువెళ్లాలన్నారు. వెబ్ కాస్టింగ్, దివ్యాంగుల సౌకర్యార్థం వీల్చైర్, ఒక హెల్పర్, ర్యాంప్ తదితర మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సూచించారు. రామగుండం రిటర్నింగ్ అధికారి అరుణశ్రీ, ఈవీఎం పరికరాల నో డల్ అధికారి రామ్మోహన్రావు, ఏఆర్వో కు మారస్వామి, మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.
అలర్ట్.. అడ్మిన్!
సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపించటంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్రచార సరళి మారడం, సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు సైతం విస్త్రృతంగా వినియోగించుకుంటున్నారు. అభ్యర్థులు ఇచ్చే హామీలు, ప్రత్యర్థులపై చేసే విమర్శలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల హడావుడి ఉంటుంది. వీటిని ఎవరూ సీరియస్గా తీసుకోనంత వరకు ఇబ్బంది లేదు. కానీ ఎన్నికల సమయంలో ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు సైతం సామాజిక మాధ్యమాల్లో సందేశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించననున్నారు.
అడ్మిన్ బాధ్యతలు
సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలకు వాట్సప్ గ్రూప్ల అడ్మిన్లదే బాధ్యత, గ్రూప్లో ఉండే ప్రతి సభ్యుడు ఖచ్చితంగా అడ్మిన్కు తె లిసి ఉండే విధంగా చూసుకోవాలి. ఎవరైనా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే వెంటనే గ్రూప్ నుంచి తొలగించాలి. అడ్మిన్, గ్రూప్ సభ్యులు వివాదాస్పద పోస్టులు చేస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశముంది
చట్టాలు ఏం చెబుతున్నాయంటే
అశ్లీల సమాచారం, మార్ఫింగ్, తప్పుడు సమాచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా సమాచారం పోస్టు చేస్తే సెక్షన్ 67 కింద మొదటి సారి నేరం చేస్తే అయిదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.లక్ష వరకు జరిమానా, రెండోసారి అంతకన్నా ఎక్కువసార్లు ఇలాంటి నేరాలకు పాల్పడితే పదేశ్ల జైలు శిక్ష, రూ.2లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇవి షేర్ చేయొద్దు
విద్వేషాలు రెచ్చగొట్టే, తప్పుడు, తెలియని అంశాలు, మధ్య వివాదాలు సృష్టించే సందేశాలు, మార్పిగ్ చేసిన ఫొటోలు, వీడియోలు, తప్పుదారి పట్టించే సమాచారం షేర్చేయొద్దు.