న్యూస్రీల్
శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
● ఎన్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ● సెప్టెంబర్ నాటికీ పూర్తికాని ఉడుపులు ● అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న మోస్తరు వర్షాలు
పాలకొండ రూరల్/మక్కువ/బలిజిపేట:
ఖరీఫ్ ప్రారంభం నుంచి అన్నదాతలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగునీటి వనరుల ద్వారా రైతుల పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించకపోవడం, ఆశించిన మేర వానలు కురవక పోవడంతో జిల్లా వ్యాప్తంగా సీజనల్ వరి సేద్యంతో పాటు ఇతర వాణిజ్య, కూరగాయపంటల సేద్యం, దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలో అండగా ఉండాల్సిన యంత్రాంగం, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ రైతన్నలు మండిపడుతున్నారు. సాగునీరు అందక నాట్లు వేసేందుకు అవకాశం లేక సెప్టెంబర్ నెల గడిచిపోతున్నా వేలాది ఎకరాలు ఖాళీగా దర్శనమిస్తున్నా యి. శివారు భూములకు కీలక సమయంలో తడులు అందక వరి, కాయగూరల పంట భూములు బీడువారిపోయాయి.
అల్పపీడనంతో చిగురించిన ఆశలు
నాట్లు వేసే సమయం ముగిసిపోవడం, సిద్ధం చేసి న నారు ముదిరిపోవడం, సాగునీరు లేక రైతు నీరసించిపోయాడు. వెదలు, తొలి దశలో చేపట్టిన ఉడుపులు ఎండుముఖం పట్టడంతో భారం భగవంతుడి పై వేసిన కర్షకులకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జీవం నిలిపింది. గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాలతో ఆశలు కొంతమేర చిగురించాయి. సాధారణ వర్షపాతంతో పోల్చితే ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 32 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. శుక్రవారం నాటికి అత్యల్పంగా సాలూరు మండంలో 10.6 మిల్లీమీటర్లు, అత్యధికంగా సీతంపేట ఏజెన్సీలో 73.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువన ఉండే ఒడి శా రాష్ట్రాల్లో వర్షాలు కురిసినా ఇక్కడికి ఆ నీరు నదుల ద్వారా చేరితే కొంతమేర లాభం ఉంటుంది. మరో వారం రోజులు వర్షాలు కొనసాగితే తప్ప పంటలపై ఆశలు ఉండవని రైతులు చెబుతున్నారు. నేటికీ సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో..
అధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల పంటలకు సంబంధించి సాగువిస్తీర్ణం 88,858 హెక్టార్లు. ఈ ఏడాది వరి 72,829 హెక్టార్లలో సేద్యం చేపట్టారు. ప్రస్తుతానికి 66,325 హెక్టార్లల్లో నాట్లు వేయగా దాదాపు 20 వేల ఎకరాల్లో ఉడుపులు జరగలేదని రైతులు చెబుతున్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పంటల బీమా భారం రైతులపైనే వేసింది.


