గరుగుబిల్లి: ఎగువన ఉన్న ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు, అల్పపీడనం కారణంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం సాయంత్రం బ్యారేజీవద్ద నీటిమట్టం 105 మీటర్లకు గాను 104.38 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొ త్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.140 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజీకి సగటున 10వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, ఈమేరకు మూడు గేట్లు ఎత్తి సగటున 8,200 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టువద్ద నీటిపరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు బి.కిషోర్ కుమార్, శ్రీనివాసరావవులు పర్యవేక్షిస్తున్నారు. ప్రా జెక్టుకు అధికంగా వరద వస్తే దిగువకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సాలూరు రూరల్: ఎట్టకేలకు రెండేళ్ల తరువాత కొత్త పెన్షన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అదికూడా ఒక్క వారం రోజులు గడువులోగా దరఖాస్తులు పూర్తిచేసుకోవాలి. దీంతో పెన్షన్ పథకానికి అర్హత ఉన్నవారంతా గడిచిన నాలుగురోజులుగా మీసేవ, సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పట్టణంలోని మీసేవ కేంద్రాలకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు క్యూకడుతున్నారు. రో జంతా కష్టపడి ఎలాగోలా దరఖాస్తుచేసుకుని వాటిని ఆమోదింపచేసేందుకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పెన్షన్ ప్రక్రియ ప్రారంభించడంపై ప్రజల్లో కాసింత ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పార్వతీపురం రూరల్: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి జూనియర్ సివిల్ జడ్జి కె.రమేష్ సతీమణి జి.అనూష పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ కేంద్రాస్పత్రిలో శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. జడ్జి రమేష్ అత్తవారిది పార్వతీపురం పట్టణమే కావడంతో, కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఉన్న సర్కారు దవాఖానాలోనే చేర్పించారు. ఓ సివిల్ జడ్జి హోదాలో ఉన్న వ్యక్తి తన భార్యను ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పాలకొండలోని జ్ఞాన సరస్వతి మందిరంలో భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస అమావాస్య సందర్భంగా జ్ఞాన సరస్వతీ దేవిని 108 చీరలతో అలంకరించారు. లలితా సహస్రనామాలు, మహా మణిదీప వర్ణన, సరస్వతి అష్టోత్తర శతకాన్ని పఠించారు. అర్చకుడు షరత్కుమార్ నేతృత్వంలో శాస్త్రోక్తంగా శ్రావణ మాస, మాస అమావాస్య పూజలు జరిపారు. – పాలకొండ రూరల్


