● సమగ్ర విచారణకు సీపీఐ డిమాండ్ ● జేసీకి వినతిపత్రం అందజేత
పార్వతీపురం రూరల్: బాల సంజీవని, బాల సంజీవని ట్రైబల్ పథకాల టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే జోక్యం చేసుకుని, సమగ్ర స్వతంత్ర విచారణకు ఆదేశించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీపీఐ మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మథరావు, కార్యవర్గ సభ్యులు ఆర్వీఎస్ కుమార్.. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టెండర్ల నిర్వహణ లో నిబంధనలకు నీళ్లొదిలి, కొద్దిమంది కాంట్రాక్టర్లకే గంపగుత్తుగా ప్రయోజనం చేకూర్చారని ఆరోపించారు. టెండర్ల రేట్ల పెంపుతో సుమారు రూ.29.22 కోట్ల ప్రజాధనం అదనంగా ఆవిరయ్యే ప్రమాదం ఉందన్నారు. గతంలో అనర్హత వేటు పడిన సంస్థలకు టెండర్లలో పచ్చజెండా ఊపడంపై విచారణ జరపాలన్నారు. టెండర్ల కేటాయింపులు, నాణ్యతా పరీక్షలు, భారీ చెల్లింపులపై పూర్తిస్థాయిలో ఆడిట్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మహిళా స్వయం సహాయక సంఘాలకు, చిన్న, మధ్యతరహా సంస్థలకు టెండర్లలో సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే వ్యవహారంపై సీఎంకు లేఖరాసినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తెలిపారు.


