● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు
విజయనగరం రూరల్:
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు పిలుపునిచ్చారు. సహజ వనరుల సంరక్షణ, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం, హరిత క్యాంపస్ అభివృద్ధి, క్రీడలు–ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను సమగ్రంగా అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సెంటర్ ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైన్బిలిటీ కార్యక్రమం రూపొందించారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను కళాశాలలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యా సంస్థలు కేవలం సాంకేతిక విద్యను అందించడమే కాకుండా పర్యావరణ బాధ్యత, శక్తి సంరక్షణ, స్థిరమైన అభివృద్ధి పట్ల విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించాలని కోరారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వకుళ మాట్లాడుతూ నీరు, సహజ వనరుల సంరక్షణ, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం–హరిత క్యాంపస్ అభివృద్ధి, క్రీడలు–ఆరోగ్య పరిరక్షణ అనే ఆరు ప్రధాన విభాగాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థుల భాగస్వామ్యం పెంపొందించేందుకు గ్రీన్ ఎనర్జీ క్లబ్, ఆక్వా క్లబ్, ఎకో వేస్ట్ క్లబ్, గ్రీన్ హార్వెస్ట్ క్లబ్, ఎనర్జీ సేవర్ క్లబ్, ఫిట్ ఇండియా క్లబ్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. క్యాంపస్లో ఎనర్జీ, వాటర్ ఆడిట్, వర్షపు నీటి సంరక్షణ, వ్యర్థాల వర్గీకరణ–కంపోస్టింగ్, సౌర, పవన్ శక్తి వినియోగం, సేంద్రియ సాగు, గ్రీన్ క్యాంపస్ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు విద్యార్థులను పరిశోధన, ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమాన్ని సస్టైన్బుల్ డవలప్మెంట్ గోల్స్తో అనుసంధానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి రిజిస్ట్రార్ కేసీబీ రావు, ఎలక్ట్రికల్ ప్రాజెక్టు ఇంజనీర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.పద్మజ, ఈసీఈ ఇన్చార్జి విభాగాధిపతి జి.అప్పలనాయుడు, ఎన్ఎస్ఎస్ విభాగం అధికారి బి.ధర్మారావు, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థులు, పాల్గొన్నారు.


