బొండపల్లి: మండలంలోని కనిమెరక గ్రామానికి చెందిన మహిళ బుంగ సంధ్య మెడపై గాయాలతో అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందింది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒకే గ్రామానికి చెందిన రామముత్యాలు, సంధ్య 8 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నేళ్ల వరకు వారి సంసారం బాగానే సాగడంతో పాటు, వారికి ఽమూడవ తరగతి చదువుతున్న ధర్మతేజతో పాటు, 1 వ తరగతి చదువుతున్న రష్మిక ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత మద్యానికి బానిసైన రామముత్యాలు నిత్యం భార్యతో పాటు, ఆమె కుటుంబ సభ్యులను అదనపు కట్నం కోసం వేధించడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో సంధ్య మృతిపై ఆమె తల్లి, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే గ్రామంలో ఉంటున్న సంధ్య తల్లి ఈశ్వరమ్మ తన కూతురి మృతిపై మాట్లాడుతూ అదనపు డబ్బు వేధింపులతో పాటు, మద్యానికి బానిసైన అల్లుడే తన కూతురిని చంపి ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నాడని పోలీసులు ముందు తన అనుమానం వ్యక్తం చేసింది. సోమవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలో తన కూతురిపై దాడి చేసి హత మార్చి ఉంటాడని వాపోయింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి ఇంటితో పాటు, మృతురాలి ఒంటిపై ఏవైనా హత్య చేసిన గాయాలు ఉన్నాయా? అన్న కోణంలో పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే పూర్తిస్థాయి వివరాలు సేకరించేందుకు క్లూస్ టీంతో పాటు, డాగ్ స్వాడ్ను రప్పించి అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ కుటుంబం ఇంటి పరిసర ప్రాంతంలో వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
పోస్టుమార్టం నివేదిక వచ్చాక చర్యలు
ఈ విషయమై సీఐ ఎస్.సన్యాసినాయుడిని అడగగా సంధ్య మరణాన్ని అనుమానాస్పద మృతిగా భావించి అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించి ఇద్దరు వైద్యులతో పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. పూర్తిస్థాయి రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భర్తే హత్య చేసి ఉంటాడని
మృతురాలి బంధువుల ఆరోపణ
క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్తో మృతురాలి ఇల్లు పరిశీలన
అనాథలైన ఇద్దరు చిన్నారులు


