క్షణాల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి
విషాదంలో కుటుంబసభ్యులు, గ్రామస్తులు
కన్న కొడుకు మృతితో..
సింహాచలం (ఫైల్)
రమణ (ఫైల్)
పాలకొండ రూరల్:
కన్నకొడుకును చేయిపట్టి నడిపించాడు. పెంచి పెద్దవాడిని చేశాడు. ఓ ఇంటి వాడిని చేసిన కొడుకు పున్నామ నరకం తప్పిస్తాడనుకుంటే..విధి వక్రించడంతో తన కళ్లతో కొడుకు మృతదేహాన్ని చూసిన ఓ కన్న తండ్రి గుండె ఆగిపోయింది. బుధవారం జరిగిన ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్.ఎల్.పురం గ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచేసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముంజి రమణ (35) భవన నిర్మాణ కార్మికుడిగా పనులు చేస్తూ భార్య రామలక్ష్మి, కుమార్తెతో కలిసి విశాఖలో నివసిస్తున్నాడు. రమణ ఆరోగ్యం కొన్నిరోజులుగా క్షీణించింది. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబంతో కలిసి బుధవారం బస్సులో స్వగ్రామం బయల్దేరాడు. గోపాలపురం సమీపానికి చేరుకుంటున్న సమయంలో బస్సులోనే రమణ మరణించాడు. ఆ విషయం తెలుసుకున్న ఆర్టీసీ సిబ్బంది మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్కు చేర్చారు. అప్పటికే షాక్లో ఉన్న మృతుడి భార్య రామలక్ష్మి తన అత్తవారికి ఫోన్లో సమాచారం చేరవేసింది. కుమారుడి మరణ వార్త విన్న తండ్రి సింహాచలం(72) దుఃఖాన్ని దిగమింగి ఆటోతో కాంప్లెక్స్కు చేరుకున్నారు. కుమారుడి మృతదేహం ఆటోలో ఎక్కించి స్వగ్రామం వెళ్తేందుకు సిద్ధం కాగా ఆటో మండల పరిధిలోని వీపీ రాజుపేటకు చేరుకునే సమయంలో అదే ఆటోలో తండ్రి సింహాచలం గుండె ఆగిపోయింది. తండ్రీకొడుకుల మృతితో సింహాచలం భార్య, రమణ తల్లి సీతమ్మతోపాటు కోడలు రామలక్ష్మి, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. సింహాచలానికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారుడి మరణం తట్టుకోలేక తండ్రి కూడా తనువు చాలించడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.


