● ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు ● అధికారిక తవ్వకాలు పేరిట అడ్డంగా దోచేస్తున్న వైనం ● నాగావళి నుంచి ఒడిశాకు తరలిపోతున్న ఇసుక
ఇసుక తరలిస్తున్న వాహనాలు
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఇటీవల జిల్లా సరిహద్దుల నుంచి రాయగడ వైపు ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను ఒడిశాలోని శేషికాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, వే బిల్లులు లేకపోవడం గుర్తించిన పోలీసులు లారీలను సీజ్ చేశారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మరో లారీ రోడ్డుపైనే ఇసుకను డంప్ చేసి అక్కడ నుంచి పరారైనట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న రెండు వాహనాలు కాసీపూర్ సమితి పరిధిలోని టికిరి పారిశ్రామిక ప్రాంతం వైపు వెళుతున్నట్లు వెల్లడైంది. ఒడిశా పరిధిలోని నాగావళి నది నుంచి ఇసుక తవ్వకాలకు అక్కడి యంత్రాంగం ఆంక్షలు విధించడంతో కొన్ని పారిశ్రామిక సంస్థలు పార్వతీపురం మన్యం జిల్లా పరిధి కొమరాడ ప్రాంతంలోని రీచ్ల నుంచి ఇసుక కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది.
జిల్లాలోని కొమరాడ మండలం పరిధి నాగావళి నదిలో ఇసుక సేకరణ అనుమతులు పేరుతో అంత లేని అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి.. దోపిడీ యథేచ్ఛగా సాగు తోంది. కొమరాడ మండలం చోళ్లపదం వద్ద నాగావళిలో 5.52 ఎకరాల్లో 18,900 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకానికి అధికారులు అనుమతించారు. ఇక్కడ స్టాక్ పాయింట్ నుంచి ఇసుక బయటకు వెళ్తే గనులశాఖ సూచించిన ఆన్లైన్ బిల్లు ఆధారంగానే రవాణా అవ్వాలి. ఇందుకు భిన్నంగా సాగుతోంది. కార్తికేయ రీచ్ పేరు మీద ముద్రించి ఉన్న రసీదులు ఇచ్చి, చేతులు దులుపుకొంటున్నారు. కొన్ని సార్లు కనీసం సంతకం కూడా ఉండదు. ఒక్క ట్రాక్టర్ నంబరు మాత్రమే రాస్తున్నారు. చేతితో రాసిన రసీదు లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదనే నిబంధన ఇక్కడ బేఖాతరు అవుతోంది. చేతి రాతలతోనే ట్రాక్టర్లు, లారీలకు రసీదులు ఇచ్చేస్తున్నారు.
దొరికినంత తవ్వుకో...
స్థానిక అవసరాలకు మాత్రమే ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక ఉచితమని ప్రభుత్వం చెబుతోంది. ఒడిశా రాష్ట్రానికి ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక వెళ్లడానికి వీలు లేదని ఇటీవల జరిగి న జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో అవేవీ అమలు కావడం లేదు. అర్ధరాత్రి వేళల్లో లారీల ద్వారా ఒడిశా రాష్ట్రానికి పెద్ద ఎత్తున తరలిస్తున్నా రు. ఇక్కడ పోలీసులు, అధికారుల కళ్లు గప్పిన కొ న్ని లారీలు ఒడిశా రాష్ట్రం పోలీసులకు దొరకడం గమనార్హం. దీన్ని బట్టి మన దగ్గర నిఘా వ్యవస్థ నుంచి ఎంత సహకా రం ఉందో అర్థం అవుతోంది.
●ఎంత లోతు, ఎంత పరిమాణంలో సేకరించాలి? అన్న నిబంధనలను రీచ్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. పరిమితికి మించి తవ్వేస్తున్నా రు. దీనికి ఎక్కడా లెక్కలు ఉండటం లేదు. ఆన్లైన్ బిల్లుల ఇవ్వడం లేదు. గనులశాఖ అధికారుల పర్యవేక్షణ అసలు ఉండటం లేదు.
●రేవును గుర్తించే మార్కులు, జెండాలు గానీ.. సీసీ కెమెరాల పర్యవేక్షణ గానీ ఉండడం లేదు. వివరా లు ఎప్పటికప్పుడు గనులశాఖకు అప్లోడ్ చేయడం లేదు.
●నిర్వాహకులకు అధికార పార్టీ సహకారం, కీలక అధికారి అండదండలు దండిగా ఉండడంతోనే నిర్వాహకులు ఇష్టారీతిన తవ్వకాలు, అమ్మకాలు జరుపుతున్నారని తెలుస్తోంది.
ఇసుక ఉచితం కదా అనే ఉద్దేశంతో ఈ చిత్రంలోని ప్రసాద్ అనే వ్యక్తి ట్రాక్టర్తో కొమరాడ మండలం గుమడ నుంచి ఇసుక తరలిస్తున్నాడు. మార్గమధ్యంలో శివిని, విక్రమపురం గ్రామల మధ్య కారులో వచ్చిన వ్యక్తులు అడ్డగించారు. ఇసుక తరలిస్తున్న ప్రసాద్ను బెదిరించి, రూ.40 వేలు కట్టాలని డిమాండ్ చేశారు. తాను డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఆ వ్యక్తి ప్రశ్నిస్తే.. కారులో ఉన్న వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సెకన్ల వ్యవధిలోనే ఓ కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నాడు. అక్కడ కూడా డబ్బులు కట్టాలని డిమాండ్. కుదరకపోవడంతో పోలీస్ స్టేషన్ పేరిట డంగభద్ర ప్రాంతానికి తరలించారు. చివరికి బేరసారాల తర్వాత రూ.10 వేలు కట్టేందుకు ఒప్పందం కుదిరింది. అందుకు సద రు వ్యక్తులు, పోలీసులు శ్రీనివాసరావు పేరుతో ఓ స్కానర్ ఇచ్చి ఆ మొత్తం పంపించుకుని కార్తికేయ శాండ్ రీచ్ పేరిట ఆన్లైన్ బిల్లు కాకుండా, ఒక రసీదు ఇచ్చేశారు.


