పార్వతీపురం రూరల్ : జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాజరు వివరాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు విడుదల చేశారు. జనరల్ విభాగంలో మొత్తం 1,597 మంది విద్యార్థులకుగాను 1,436 మంది హాజరు కాగా, 161 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యలో (ఒకేషనల్) 1,585 మందికి 1,394 మంది పరీక్షకు హాజరు కాగా, 191 మంది రాలేదు. జిల్లా వ్యాప్తంగా 3,182 మంది అభ్యర్థులకుగాను 2,830 మంది హాజరయ్యారని, 352 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్టు ఆయన తెలిపారు.
‘పవన్ కళ్యాణ్ సార్... మా ఊరికి రోడ్డు వేయండి.. రోడ్డులేక రోజూ సుమారు 17 మంది చిన్నారులం రాళ్లు, రప్పలు దాటుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూడి గ్రామంలోని పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాం... రోడ్డు నిర్మించి కష్టాలు తీర్చండి’ అంటూ పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కేరంగి పంచాయతీ పరిధిలోని కోదులమడ గ్రామ చిన్నారులు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఫొటోలు పట్టుకుని తమ కష్టాలు వివరించారు. రోడ్డు కోసం ప్రాథేయపడుతున్న చిన్నారుల వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. – పాచిపెంట


