కిడ్నీ రోగులకు రవాణా కష్టాలు..!
● ఆస్పత్రికి వచ్చే రోగులకు 108 సౌకర్యం రద్దు
● అవస్థలు పడుతున్న రోగులు
● వేలాది రుపాయలు ఖర్చు పెట్టి
డయాలసిస్ సెంటర్కు వస్తున్న రోగులు
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆటోలో కూర్చున్న మహిళ పేరు కొట్యాడ కొండమ్మ. ఆమెది ఎస్.కోట మండలంలోని శివరామరాజుపేట. గడిచిన మూడు నెలలుగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్కు డయాలసిస్ చేయించుకోవడానికి, నెలకు 8సార్లు ఆమె వస్తోంది. ఒకసారి డయాలసిస్ సెంటర్కు వచ్చి ఇంటికి వెళ్లడానికి రూ.1500 చొప్పన ఖర్చు అవుతుంది ఈలెక్కన నెలకు రూ.12 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇవికాక మందులు ఇతర ఖర్చులకు మరో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు తప్పదు.
విజయనగరం ఫోర్ట్: ఇలా ఈ ఒక్క మహిళా రోగే కాదు. అనేక మంది డయాలసిస్ చేయించుకోవడానికి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి రావడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది రోగులకు నెలకు 8 సార్లు డయాలసిస్ అవసరం పడగా, మరి కొంతమందికి 6 సార్లు అవసరం పడుతుంది. విజయనగరంలో ఉన్న డయాలసిస్ సెంటర్కు రావడానికి రవాణా చార్జీలు, భోజనం, ఇతరఖర్చులకు వారికి తడిసిమోపుడుతోంది. కిడ్నీ వ్యాధితీవ్రమైనవారికి డయాలసిస్ చేస్తారు. అటువంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి కానీ చంద్రబాబు సర్కార్ నిర్దయతో కిడ్నీ రోగుల పట్ల వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో 108 ద్వారా తరలింపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కిడ్నీ రోగులను డయాలసిస్ సెంటర్కు 108 అంబులెన్సుల ద్వారా ఉచితంగా తరలించేవారు. దీంతో వారు ఎంతో సంతోషించేవారు. రవాణా చార్జీలు లేకుండా ఉచితంగా డయాలసిస్ సెంటర్కు తరలించడం వల్ల తమకు సమయం, డబ్బు ఆదా అయిందని భావించేవారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే 108 సౌకర్యం రద్దు
చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే కిడ్నీ రోగులను 108 అంబులెన్సు ద్వారా డయాలసిస్ సెంటర్కు ఉచితంగా తరలించే సౌకర్యానికి మంగళం పాడేసింది. దీంతో కిడ్నీ రోగులు సొంత డబ్బులు పెట్టుకుని ప్రైవేట్ వాహనాల్లో డయాలసిస్ సెంటర్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ రోగులు వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కిడ్నీ రోగుల సంక్షేమానికి పాటు పడుతున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్ వారికి ఉచితంగా అందే రవాణా సౌకర్యాన్ని రద్దు చేయడం పట్ల కిడ్నీరోగులు ఆవేదన వ్యక్తం అవుతున్నారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఉన్న సౌకర్యాలు రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
తరలించే సౌకర్యం రద్దు
కిడ్నీ రోగులను డయాలసిస్ సెంటర్కు 108 అంబులెన్సు ద్వారా తరలించే సౌకర్యం లేదు. ఏడాది క్రితమే ప్రభుత్వం ఈ సదుపాయాన్ని రద్దు చేశారు.
ఎస్.మన్మథ నాయుడు, 108 జిల్లా మేనేజర్
కిడ్నీ రోగులకు రవాణా కష్టాలు..!
కిడ్నీ రోగులకు రవాణా కష్టాలు..!


