ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఉద్యాన సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రుపొందించినట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో ఆయన బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సాహవంతులైన రైతులను మార్గదర్శకులుగా ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమం అమలు చేయడానికి మండల స్థాయి అధికారులతో ఈ నెలఖారున ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, ఉద్యాన శాఖాధికారి చిట్టిబాబు, ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీనారాయణ, విద్యుత్ శాఖ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీల పట్టివేత
బొబ్బిలి రూరల్: ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి పూట చెరువుల్లో మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్న మట్టి లోడుతో ఉన్న నాలుగు టిప్పర్ లారీలను కలవరాయి గ్రామం వద్ద రెవెన్యూ శాఖ ఆర్ఐ రామకుమార్ పట్టుకున్నారు. తహసీల్దార్ శ్రీనుకు అందిన సమాచారం మేరకు మంగళవారం నిఘా పెట్టిన రెవెన్యూ వర్గాలు అర్థరాత్రి కాపుకాసి కలవరాయి గ్రామంలో చెరువు నుంచి బొబ్బిలి పట్టణ రియల్ ఎస్టేట్ వెంచర్కు టిప్పర్లతో మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. మైనింగ్ శాఖ ఇచ్చిన గణాంకాల మేరకు మట్టి లోడును పరిశీలించి 50వేల రూపాయిల జరిమానా విధించారు. మొదటిసారి జరిమానాతో విడిచిపెడుతున్నామని, మరో మారు అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తే కేసులు పెడతామని యజమానికి, కాంట్రాక్టర్ను తాహసీల్దార్ శ్రీను హెచ్చరించారు.
వివాహిత ఆత్మహత్య
పూసపాటిరేగ : మండలంలోని ఎరుకొండ గ్రామంలో అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరి వేసుకొని మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు, మృతురాలు బంధువుల కథనం మేరకు పూసపాటిరేగ ఎస్పీ కాలనీకి చెందిన పాండ్రికి పుష్ప(19)కి ఎరుకొండ గ్రామానికి చెందిన శొంఠ్యాన శివతో మూడు నెలలు క్రితం వివాహం జరిగింది. వివాహ సయంలో శివ కుటుంబ సభ్యులు రూ.3 లక్షలు అదనపు కట్నం కోసం డిమాండు చేయడంతో ఇరువురు గ్రామాల పెద్దలు సర్ది చెప్పి అత్త వారింటికి పుష్పను కాపురానికి పంపించారు. అప్పటి నుంచి పుష్పను అత్తవారు వేధించడంతో మంగళవారం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అత్తింటి వారి వేధింపులు తాళలేకే తమ కుమార్తె మృతి చెందిందని తల్లి పాండ్రంకి రమ కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి : కలెక్టర్


