గంజాయి కేసుల్లో దర్యాప్తు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

గంజాయి కేసుల్లో దర్యాప్తు వేగవంతం

Sep 3 2025 4:53 AM | Updated on Sep 3 2025 4:53 AM

గంజాయి కేసుల్లో దర్యాప్తు వేగవంతం

గంజాయి కేసుల్లో దర్యాప్తు వేగవంతం

ఎస్‌హెచ్‌ఓలతో ఎస్పీ జూమ్‌ కాన్ఫరెన్స్‌

విజయనగరం క్రైమ్‌: గంజాయి కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ వకుల్‌ జిందల్‌ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్స్‌తో ఎస్పీ మంగళవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆదేశాలను జారీ చేశారు. అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఎన్డీపీఎస్‌ చట్టం ప్రకారం నమోదై, దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులపై ఎస్పీ వకుల్‌ జిందల్‌ సమీక్ష చేశారు. దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకుని కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పరారీలో ఉన్న నిందితుల గురించి సమాచారం సేకరించాలని, వారి ఆచూకీని గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని సూచించారు. అవసరమైతే ఆయా కేసుల్లో ప్రెసిడెన్సీ పాస్‌పోర్టు తీసుకుని, ఇతర రాష్ట్రాలకు పోలీసు బృందాలను పంపాలని అధికారులను ఆదేశించారు. తరచూ ఇదే తరహా నేరాల్లో అరెస్టు అవుతున్న నిందితులపై హిస్టరీ షీట్లు ప్రారంభించి, వారి కదలికలపై నిఘా పెట్టాలని చెప్పారు. నిందితులు ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే వారి హిస్టరీ షీట్లను సంబంధిత పోలీస్‌స్టేషన్లకు బదిలీ చేయాలన్నారు. ఎన్డీపీఎస్‌కు అనుకూలంగా ఉన్న కేసుల్లో అనుమతులు పొంది నిందితులను ముందస్తుగా అరెస్టు చేయాలన్నారు.

నిందితుల ఆస్తులు అటాచ్‌ చేయాలి

గంజాయి వ్యాపారంతో అక్రమంగా సంపాదించిన వారి ఆస్తులను గుర్తించి, ఫైనాన్షియల్‌ ఇన్విస్టిగేషన్‌ పూర్తి చేసి, వారి అక్రమ ఆస్తులను అటాచ్‌ చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. గంజాయితో పట్టుబడిన కేసుల్లో గంజాయి రవాణాకు పాల్పడిన వ్యక్తులతోపాటు, వారికి గంజాయిని సరఫరా చేసిన వ్యక్తులు, విక్రయించిన వ్యక్తులను, ఇతర ప్రధాన నిందితులను కూడా ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చాలని తెలిపారు. నాన్‌ బెయిలబుల్‌ వారంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటిని ఎగ్జిక్యూట్‌ చేసేందుకు సిబ్బందిని నియమించాలని చెప్పారు. రాబోయే లోక్‌ అదాలత్‌లలో ఎక్కువ కేసులు డిస్పోజ్‌ అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగులో ఉన్న గంజాయి కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి, నిందితులపై అభియోగ పత్రాలను దాఖలు చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.ఈ జూమ్‌ కాన్ఫరెస్సులో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్య రెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్‌.రాఘవులు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement