
మూడు రెట్లు పెరిగిన గంజాయి కేసులు
● గంజాయి రవాణాపై గట్టి నిఘా
● ఎస్పీ వకుల్ జిందల్
బొబ్బిలి: జిల్లాలో గంజాయి రవాణా నిరోధించేందుకు గట్టి నిఘా ఉంచామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఆయన శుక్రవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ఏడాదితో పోలిస్తే గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులు మూడు రెట్లు పెరిగాయన్నారు. అలాగే అరెస్టులు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. ఇప్పటికే అరెస్టయిన వారి నుంచి రూ.కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశామన్నారు. గంజాయి రవాణా చేసిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఆన్లైన్ లోన్ యాప్లను ఓపెన్ చేయొద్దన్నారు. యాప్లలో రుణం తీసుకుంటే అసలు కన్నా అధిక రెట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. అలాగే ఆన్లైన్లో మీకు లక్షలాది రూపాయల లాటరీ వచ్చిందని, మీరు రూ.కొంత సొమ్ము కడితే మిగతా సొమ్ముతో పాటు చెల్లిస్తామని చెప్పి పత్తా లేకుండా పోతారన్నారు. దీని వలన ప్రజలు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఈ సందర్భంగా స్టేషన్లోని కంప్యూటర్ విభాగాన్ని, సీసీ కెమెరాల కంట్రోల్ విభాగాన్ని పరిశీలించారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ బైక్లను పరిశీలించారు. వాటి వివరాలను డీఎస్పీ జి భవ్యారెడ్డి, సీఐలు కె.సతీష్ కుమార్, నారాయణరావులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్లో గౌరవ వందనం స్వీకరించారు. ఎస్ఐలు ఆర్.రమేష్కుమార్, పి.జ్ఞానప్రసాద్, ఏఎస్ఐ డి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
దోనుబాయి పీఎస్ను సందర్శించిన ఎస్పీ
సీతంపేట: దోనుబాయి పోలీస్స్టేషన్ను ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ ఆవరణను, రికార్డులు పరిశీలించారు. సైబర్ క్రైం, రహదారి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గణేష్ చతుర్దిని పురస్కరించుకుని ఊరేగింపుల్లో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. కాగా దోనుబా యి ప్రాంతంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ పలు అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ, ఆయనపై చర్యలు తీసుకోకపోతే నూతన నక్సలిజం పార్టీ త్వరలో జనంలోకి వస్తాదంటూ స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్టు దోనుబాయి యూత్ పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో శుక్రవారం హల్చల్ చేసింది. దీనిపై ఎస్పీ ఆరా తీసినట్టు తెలిసింది. తహసీల్దార్ శ్రీకన్య వద్ద ఈ విషయమై ప్రస్తావించగా దీనిపై ఆర్ఐను విచారణకు నియమించామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ షేక్మస్తాన్ పాల్గొన్నారు.

మూడు రెట్లు పెరిగిన గంజాయి కేసులు