ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధి సాధ్యం

Apr 20 2025 2:38 AM | Updated on Apr 20 2025 2:38 AM

ఆధునికంగా సాగితే  15 శాతం వృద్ధి సాధ్యం

ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధి సాధ్యం

విజయనగరం అర్బన్‌: ప్రాథమిక రంగాలైన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక రంగాల్లో ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధిరేటు సాధ్యమవుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి చెందుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి అధికారి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ అన్నారు. వ్యవసాయంలో కొత్త ఆలోచనలు, ప్రయోగాలు అమలుచేయాలన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్‌ డా.అహ్మద్‌బాబు, జిల్లా అధికారులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వద్ధి రేటు సాధనకు ఆయా శాఖల అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పండించే పంటలు, కూరగాయలు, పూలు ఇతర ఉద్యాన ఉత్పత్తులకు విశాఖలో మంచి మార్కెట్‌ ఉందని, దీనిని వినియోగించుకోవాలన్నారు. అహ్మద్‌ బాబు మాట్లాడుతూ వృద్ధిరేటు సాధనలో కిందిస్థాయి సిబ్బందిని భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, సీపీఓ పి.బాలాజీ, డీఆర్వో ఎస్‌.శ్రీనివాసమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌తో జాతీయవాష్‌ నిపుణుల భేటీ

విజయనగరం అర్బన్‌: కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌తో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కవిత ఆధ్వర్యంలో జాతీయ వాష్‌ (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) నిపుణులు సుధీర్‌కుమార్‌ బండారీ, సౌమేంద్ర రంజన్‌ గంగూలి శనివారం భేటీ అయ్యారు. జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనాంశాలను కలెక్టర్‌కు వివరించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. డీఈలు ఢిల్లీశ్వరరావు, యడ్ల గోవిందరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గొంతు కోసి..

నడిరోడ్డుపై వదిలేసి..

●పైడిభీమవరం నడిబొడ్డున ఘటన

●వివాహిత దారుణ హత్య

రణస్థలం: మండలంలోని పైడి భీమవరం నడి

బొడ్డున శనివారం సాయంత్రం జరిగిన వివాహిత దారుణహత్య కలకలం రేపింది. స్థానికులు, జేఆర్‌ పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం బోనం పేరంటాలు గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి అవాల భవాని(25) అనే వివాహితను దారుణంగా చాకుతో గొంతు కోసి వెళ్లిపోయాడు. సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగేసి అక్కడే పడేశాడు. కొన ఉపిరితో ఉన్న భవాని అక్కడకు కొద్ది దూరంలో వైఎస్సార్‌ విగ్రహం వెనుక బస్టాప్‌ దగ్గరలో చెరువు గట్టు వరకు వచ్చి అక్కడే పడిపోయి మృతి చెందింది. ఆమె భర్త వెంకట సత్యం లారీ డ్రైవర్‌గా పనికి వెళుతుంటాడు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలోని బరంపురం దగ్గరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. భవానీ స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని పెద్ద పతివాడ గ్రామం. నాలుగేళ్ల క్రితం పైడిభీమవరం పంచాయతీలోని గొల్లపేట గ్రామానికి చెందిన వెంకట సత్యంతో వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. వెంకట సత్యం లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. భవాని పైడిభీమవరంలోని ఒక హోటల్‌ పని చేస్తోంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో హోటల్‌ నుంచి వెళ్లిపోయిందని యజమాని చెబుతున్నాడు. ఆ తర్వాత ఆమె సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బస్టాప్‌ వద్ద విగతజీవిగా కనిపించింది. స్థానికులు సమాచారం అందించడంతో జేఆర్‌ పురం సీఐ అవతారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 3.30 గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఆమె ఎటు వెళ్లిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

హోటల్‌లో పని చేసిన వ్యక్తుల ప్రమేయంపై కూడా విచారణ చేస్తున్నారు. తదుపరి క్లూస్‌ టీం వివరాలు సేకరించి, మృతదేహాన్ని శవపంచనామా కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. దీనిపై జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవిని వివరణ కోరగా హత్య జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement