ప్రమాదాల నివారణకు బ్లాక్‌ స్పాట్ల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు బ్లాక్‌ స్పాట్ల గుర్తింపు

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

ప్రమాదాల నివారణకు బ్లాక్‌ స్పాట్ల గుర్తింపు రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలో జిల్లాకు మూడో స్థానం జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు జాస్మిన్‌ ఎంపిక పారదర్శకంగా సహకార ఉద్యోగుల బదిలీలు మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌కు జైలు శిక్ష

సత్తెనపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు 34 బ్లాక్‌ స్పాట్లను గుర్తించారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, జిల్లా అడిషనల్‌ ఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి ఆదేశాల మేరకు పోలీస్‌, రవాణా, ఆర్‌ అండ్‌ బీ, తదితర అధికారులు బుధవారం జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 34 బ్లాక్‌స్పాట్లు, 40 హాట్‌స్పాట్లు గుర్తించారు. డీటీఓ జి.సంజీవ్‌కుమార్‌, నాయి రోడ్‌ సేఫ్టీ సీఐ రమేష్‌బాబు, పిడుగురాళ్ల ఎంవీఐ సీహెచ్‌ రాంబాబు, సత్తెనపల్లి రూరల్‌ సీఐ హైమారావు, రాజుపాలెం ఎస్‌ఐ మణికృష్ణ పాల్గొన్నారు.

రొంపిచర్ల: పుట్టపర్తిలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి సీనియర్‌ మహిళల బేస్‌బాల్‌ పోటీల్లో పల్నాడు జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించింది. ఈ మేరకు రొంపిచర్ల జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కె. సైదయ్య బుధవారం తెలిపారు. పల్నాడు జిల్లా టీమ్‌లో రొంపిచర్ల పాఠశాలకు చెందిన పి.చంద్రిక, బి.శ్రీలక్ష్మి, ఇ.పూజిత, ఎస్‌.ప్రజ్ఞశ్రీ, ఎ.నక్షత్ర ప్రాతినిధ్యం వహించారన్నారు. జిల్లా జట్టు విజయానికి కీలకంగా నిలిచిన క్రీడాకారులను హెచ్‌ఎం బి.ఎం. సుభాని, వ్యాయామ ఉపాధ్యాయుడు, గ్రామ పెద్దలు అభినందించారు.

సత్తెనపల్లి: జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్‌ జాస్మిన్‌ ఎంపికైంది. ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకు అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పుట్‌బాల్‌ పోటీల్లో రాష్ట్రం నుంచి జాస్మిన్‌ ప్రాతినిధ్యం వహించనుంది. సత్తెనపల్లి సుగాలి కాలనీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జాస్మిన్‌ ఆటలో రాణిస్తోంది. ఆమె ఎంపికపై ఫుట్‌బాల్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.సుబ్రహ్మణ్యేశ్వర రావు, పాఠశాల హెచ్‌ఎం లతా ప్రియదర్శిని, పీడీ షేక్‌ రియాజు అభినందించారు.

కొరిటెపాడు (గుంటూరు): సహకార సొసైటీల్లోని ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌ మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. బ్రాడీపేటలోని బ్యాంకు పరిపాలనా భవనంలో బుధవారం డీఎల్‌ఈసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల అభ్యర్థనలను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. సీఈఓ పోస్టుల భర్తీ, ఉద్యోగులకు పదోన్నతులపై చర్చించారు. బ్యాంకు సీఈఓ వి.వి.ఎస్‌. ఫణికుమార్‌, గుంటూరు జిల్లా సహకార శాఖ అధికారి రత్నకుమారి, పల్నాడు జిల్లా సహకార శాఖ అధికారి నాగరాజు, ఆప్కాబ్‌ అధికారులు ఎం. శామ్యూల్‌ ధీరజ్‌, సీహెచ్‌. ధనాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

తెనాలి రూరల్‌: మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. 2021 మార్చి 14న తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన కావూరి ఉషారాణి, మేనల్లుడు మాచర్ల నవీన్‌బాబులు స్కూటీపై రేపల్లెకు బయలుదేరారు. కొల్లూరు గ్రామం కృష్ణానది కరకట్ట వద్ద టిప్పర్‌ ఢీకొని ఉషారాణి మరణించింది. డ్రైవర్‌ బుడంపాడు వాసి మస్తాన్‌ను అరెస్టు చేశారు. తెనాలి ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జ్‌ (జూనియర్‌ డివిజన్‌) ఏకా పవన్‌ కుమార్‌ బుధవారం నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement