ప్రజాసంఘాల నాయకులు, దళితుల వినతి
నరసరావుపేట: శావల్యాపురం మండలం పిచికలపాలెం దళితుల భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని, దీనికి బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు, దళితులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, డీఆర్ఓ కె.అద్దెయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో సుమారు 110 కుటుంబాల మాదిగ వర్గానికి చెందిన పేదలకు సర్వే నంబర్ 246 / సీలో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు, సర్వే నంబర్ 122లో తాగునీటి చెరువు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. మరో సర్వే నంబర్లోని భూమిలో శ్మశాన వాటికను ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతుండగా టీడీపీకి చెందిన మాజీ మండల ప్రెసిడెంట్ కె.కోటయ్య అండదండలతో గ్రామానికే చెందిన మరికొందరు మాఫియాగా ఏర్పడి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకొని ఆ భూములను అభివృద్ధి చేయాలని కోరారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కోట నాయక్, రైతు సంఘ నాయకులు ఘనపర్తి వెంకటేశ్వర్లు, పీడీఎం జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, ప్రసాద్, దళితులు పాల్గొన్నారు.


