అచ్చంపేట: అన్యాయానికి గురై అక్రమంగా అరెస్ట్ అయిన ప్రతి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెదకూరపాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. మండలంలోని గ్రంథశిరిలో కూటమి ప్రభుత్వం అన్యాయంగా బనాయించిన పీడీ యాక్టు కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కోటపాటి రాజశేఖర్ ఇటీవల బెయిల్పై విడుదలైన విషయం విదితమే. మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు పిన్నెల్లి, నంబూరులు రాజశేఖర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్సార్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ర్యాలితో పిన్నెల్లి, నంబూరులకు ఆహ్వానం పలికారు. పిన్నెల్లి, నంబూరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎవ్వరూ అధైర్య పడొద్దని మళ్లీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రామ నాయకులు రావెళ్ల శ్రీధర్, కోట శ్రీనివాసరావు, యాటగిరి రామకృష్ణ, తిరుపతిరావు, కిలారి అప్పయ్యచౌదరి, చిల్కా బెంజిమెన్, ఏలూరి గోవిందయ్య, అడుసుమల్లి వెంకటేష్, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నాయకుల అత్యుత్సాహం
ఇది చూసి ఓర్పుకోలేని టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులను గ్రామంలోకి రానీవ్వకుండా పోలీసులను పావులుగా చేసుకుని అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. గ్రామం ప్రారంభంలో బారికేడ్లు అడ్డుగా పెట్టారు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో వాటిని తొలగించారు. దారివెంట కట్టిన ప్లెక్సీలను తొలగించారు. మొదట నిర్ణయించిన దారిన కాకుండా వేరే దారికి నాయకులను మళ్లించారు.


