ఈపూరు: పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ పీడీ ఎం నాగమల్లేశ్వరి అన్నారు. పోషణ్ మాసం కార్యక్రమంలో భాగంగా ఈపూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులో శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలకు పోషకాహార విలువలపై అవగాహన కల్పించారు. పీడీ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పరిశుభ్రత పాటించాలన్నారు. ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు, భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడగాలన్నారు. పోషక విలువలు పోకుండా ఆహార పదార్థాల తయారీ విధానాన్ని వివరించారు. పోషకాహార విలువలు తెలి సేలా గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రు లను చైతన్య పరచాలని అంగన్వాడీ కార్యకర్తల కు సూచించారు. గిరిజన ప్రాంతాలలో తొమ్మిది నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులు రూ.1.53 కోట్లు మంజూరయ్యా యని తెలిపారు. నోడల్ అధికారిణి అరుణ, సీడీపీఓ ఈ వాణి, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
హత్యాయత్నం కేసులో
10 మంది అరెస్టు
మాచర్ల: పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ నమోదైన కేసులో 10 మందిని శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు. మండలంలోని సుబ్బారెడ్డిపాలేనికి చెందిన పుణ్యమూర్తి సిలువరాణి జూన్ 25న ప్రసవం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. శిశువుకు జన్మనిచ్చి ఆమె మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సుబ్బారెడ్డి, నాగులవరం, కొప్పునూరు గ్రామాలకు చెందిన పలువురిపై అప్పట్లో పట్టణ సీఐ షేక్ నజీర్ బేగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ కేసులో నిందితులుగా ఉన్న పేరువాల రమేష్, బూడిద శ్రీనివాస్, బూడిద సైదులు, నోముల కృష్ణ, జి.నాగమల్లయ్య, పి.రంగానాయక్, బొమ్మా వెంకటేశ్వర్లు, బొమ్మా తిరుపతయ్య, సీహెచ్ గోవిందరాజుతోపాటు మరొకరిని అరెస్టు చేసి శుక్రవారం మాచర్ల న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా వారికి ఆయన రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కేసుకు సంబంధించి అప్పట్లో ఇరువర్గాలు రాజీ చేసుకున్నాయి. ఆ సమయంలో వివాదం నేపథ్యంలో సీఐ నజీర్ బేగ్ కొద్ది రోజులు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల పై హత్యాయత్నం, విధులకు ఆటంకంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గురజాల సీఐ ఎం మురళీ విచారించారు.


