వినుకొండ: ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఛాయాచిత్ర పోటీల్లో వినుకొండకు చెందిన ఫొటోగ్రాఫర్ వంగపల్లి బ్రహ్మం ప్రతిష్టాత్మక ‘భారతీయ వారసత్వ, దేశభక్తి పురస్కారం’తోపాటు నగదు బహుమతికి ఎంపికయ్యారు. ‘నా భారతదేశం: 80 ఏళ్ల ప్రజాస్వామ్యం మరియు స్వచ్ఛత‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ పోటీల్లో, ఆగస్టు 15న వినుకొండ గీతాంజలి స్కూల్లో ఆయన చిత్రీకరించిన ‘ఒక దేశం – అనేక హృదయాలు‘ అనే ఫోటోకు ఈ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని నిర్వాహకులు మెయిల్ ద్వారా ధృవీకరించారు.అక్టోబర్ 2న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే వేడుకలో బ్రహ్మంకు విశ్వవిద్యాలయ బంగారు పతకంతో సత్కరించనున్నట్లు తెలిపారు. గీతాంజలి స్కూల్ ప్రతినిధి కిషోర్, పోటీల చైర్మన్ తమ్మా శ్రీనివాసరెడ్డిలతోపాటు వినుకొండ నియోజకవర్గం ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశనపల్లి సుబ్బారావు, పలువురు సభ్యులు బ్రహ్మంను అభినందించారు.


