నరసరావుపేట: రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ, తమ ఉద్యోగ భద్రత, న్యాయమైన డిమాండ్లపై తగిన నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోవటం అన్యాయమని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ నాగరాజు పేర్కొన్నారు. స్థానిక ఏరియా వైద్యశాలలో గురువారం కాంట్రాక్ట్ ఉద్యోగులు ‘‘మేము సేవ చేస్తాం–మాకు న్యాయం కావాలి అనే నినాదంతో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. నాగరాజు మాట్లాడుతూ ఈ నిరసన చేయడం ద్వారా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలని కోరారు. నిరసనలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు, రేడియోగ్రాఫర్లు, టెక్నీషియన్లు తదితర కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


