ఎన్నెస్పీ సీఈ కె.రమేష్, ఎస్ఈ టి.రమేష్
నకరికల్లు: సాగర్ కాలువల ద్వారా విడుదల చేస్తున్న నీటిని సాగుకు కాకుండా కేవలం తాగునీటికి మాత్రమే వినియోగించాలని ఎన్నెస్పీ సీఈ కె.రమేష్ తెలిపారు. మండలంలోని గుంటూరు బ్రాంచికెనాల్, ఒంగోలు బ్రాంచికెనాల్, అద్దంకి బ్రాంచి కెనాల్లో నీటి సరఫరాను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుడి కాలువ ద్వారా 8 టీఎంసీలు నీటిని మొదటి దఫా తీసుకోగా తాగునీటి అవసరాల దృష్ట్యా మరో రెండు టీఎంసీలు అదనంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలోని తాగునీటి చెరువులు నింపేందుకు రెండుసర్కిల్స్లో పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నామని వివరించారు. గుంటూరు బ్రాంచి కెనాల్కు 1400 క్యూసెక్కులు, ఒంగోలు 1800 క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచికెనాల్కు 900 క్యూసెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లింగంగుంట్ల సర్కిల్ పరిధిలో 218 చెరువులకు గాను దాదాపు అన్ని నింపడం జరిగిందన్నారు. ఒంగోలు, మార్కాపురం వైపు మరో వారం రోజులు నీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. పెట్రోలింగ్ సిబ్బంది నీటిని నిలుపుదల చేసే వరకు 24 గంటలు పహారా కాస్తారన్నారు. నీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిచారు. ఆయన వెంట లింగంగుంట్ల సర్కిల్ ఎస్ఈ తలపల రమేష్, మెయిన్ కెనాల్ ఈఈ రేపూడి మల్లికార్జునరావు, లింగంగుంట్ల డీఈ శ్రీనివాసరావు, మానిటరింగ్ సబ్డివిజన్ డీఈ కె.లింగమూర్తి, డీఈఈ విజయలక్ష్మి పాల్గొన్నారు.


