రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య
నరసరావుపేట: వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం రైతులపై పెనుభారం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో బుధవారం రైతు సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరి రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర విధానాలను ప్రశంసించటం బాధాకరమన్నారు. అమెరికా నుంచి క్వింటా పత్తి రూ.4 వేలకే దిగుమతి అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో సుమారు 26 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో గతంలో 25కు పైగా ఉన్న చెరకు కర్మాగారాలలో అనేకం ప్రభుత్వ విధానాలతో మూతపడ్డాయన్నారు. ప్రస్తుతం మూడు మిగిలాయన్నారు.
వాస్తవ విరుద్ధంగా సీఎం సూచన
అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, రైతులతు దేశంలో ఎక్కడైనా ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పడం వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఉచిత విద్యుత్ అంశంపై చట్టానికి కూటమి ఎంపీలు మద్దతు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 26న దేశ వ్యాప్తంగా ఉద్యమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పల్నాడును తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించారన్నారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుంటుపల్లి బాలకృష్ణ, సహాయ కార్యదర్శి సీహెచ్ సురేష్ రాజా, రైతు నాయకులు ఎం.నరసింహారావు, ఇ.అప్పిరెడ్డి, ఆర్.ముని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


